కెసిఆర్ రివర్స్ గేర్!: వరంగల్, గ్రేటర్తో ఎవరి బలమెంతో తేలుతుందా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రూటు మార్చారని అంటున్నారు! ఉద్యమ సమయంలోను, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ముఖ్యమంత్రి అయ్యాక.. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని కెసిఆర్ టార్గెట్ చేసుకున్నారనే వాదన ఉన్న విషయం తెలిసిందే.
ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ఇప్పటికే టిడిపి, కాంగ్రెస్ పార్టీల నుండి చాలామంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కారు ఎక్కారు. ఏ పార్టీ వారు ఎక్కుతున్నప్పటికీ.. టిఆర్ఎస్ టార్గెట్ మాత్రం కేవలం చంద్రబాబు మాత్రమే అన్నట్లుగా కనిపించేదనే వాదనలు ఉన్నాయి.
అయితే, ఇప్పుడు కెసిఆర్ దృష్టి కాంగ్రెస్ పార్టీ పైన కూడా పడిందని అంటున్నారు. ఆ మధ్య డి శ్రీనివాస్ కారు ఎక్కారు. ఆయన దారిలోనే మరికొందరు కాంగ్రెస్ పార్టీ నేతలు నడుస్తారని వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు అది జరగలేదు. కానీ, మరికొద్ది రోజుల్లో చేరే కొందరైనా చేరే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.

ఓటుకు నోటు కేసు నేపథ్యంలో టిడిపిని పూర్తిగా తుడిచి పెట్టాలని కెసిఆర్ భావించారని, కానీ అది టిడిపికి ఒకింత ప్లస్ అయిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో టిడిపి కంటే టిఆర్ఎస్కే ఎక్కువ నష్టమని వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
గ్రేటర్ ఎన్నికల్లో, వరంగల్ ఉప ఎన్నికల్లో టిడిపితో కలిసి పోవాలని బిజెపి తాజాగా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. అది నిజమా? అన్నట్లు ఇటీవల జరిగిన ఎంపీటీసీ వంటి ఉప ఎన్నికల్లో టిడిపి కొంతలో కొంత తన సత్తా చాటింది.
మరోవైపు డిఎస్ వంటి హేమాహేమీలు పార్టీని వీడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కు తెలంగాణలోను ఏపీ మాదిరే షాక్ తగలవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. దానికి తోడు, కెసిఆర్ ఆపరేషన్ ఆకర్ష్... ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మరింత దూకుడుగా కనిపిస్తోందని అంటున్నారు.
2019లోను టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని, టిడిపి - బిజెపి మిత్రపక్షంగా ఉంటే ఆ పార్టీయే రెండో స్థానంలో నిలువవచ్చునని ఇప్పటికే అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దెబ్బతినేది కాంగ్రెస్ పార్టీయే అంటున్నారు. ఏదేమైనా త్వరలో జరగనున్న గ్రేటర్, వరంగల్ ఉప ఎన్నిక ద్వారా ఎవరి బలమేంతో తేలుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications