Group-1: గ్రూప్-1 మెయిన్స్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఈ నెల 21 నుంచి పరీక్షలు ప్రారంభం..!
తెలంగాణ హైకోర్టు గ్రూప్-1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల జరిగిన గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని దాఖలైన రెండు పిటిషన్ల పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. వాటిని కొట్టేసింది. గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ సంబంధించి ఇప్పటికే తేదీలు ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ యథావిధిగా నిర్వహించనున్నారు.
గతంలో గ్రూప్-1 సంబంధించి పేపర్లు లీక్ కావడంతో పరీక్ష పలుమార్లు రద్దు అయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరీక్షల నిర్వహణ త్వరితగతిన చేపడుతోంది. ఇప్పటికే డీఎస్సీ నిర్వహించడమే కాకుండా ఫలితాలు వెల్లడించి.. ఎంపిక అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందించింది. ఇప్పుడు గ్రూప్-1 మెయిన్స్ కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. గ్రూప్-1 మెయిన్స్ సంబంధించి టీజీపీఎస్సీ ఇప్పటికే వెబ్ సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులోకి తెచ్చింది.

అభ్యర్థులు వెబ్ సైట్ కు వెళ్లి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టీజీఎస్పీఎస్సీ ఐడీ నంబర్, పుట్టిన తేదీ, క్యాప్చే ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 22న గ్రూప్-1 టీజీపీఎస్సీ నోటిఫికేషన్ (TGPSC Group-1) విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 563 పోస్టులకు జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 3.02 లక్షల మంది హాజరయ్యారు.
వీరిలో మెయిన్స్ కు 31,382 మంది ఎంపికయ్యారు. గ్రూప్-1 మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తారు. మెయిన్స్ లో 6 పేపర్లు ఉండగా.. ప్రతీ పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications