Rythu Runa Mafi: రైతులకు శుభవార్త.. రుణ మాఫీపై రెండు రోజుల్లో కీలక ప్రకటన..!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త వినిపించబోతోంది. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న రైతు రుణ మాఫీకి సంబంధించి మార్గదర్శకాలు ఒకటి రెండు రోజుల్లో రానున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆగస్టు చివరికల్లా రైతు రుణ మాఫీ పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రైతుల రుణాలు మాఫీ చేయడానికి కడుపు గట్టుకొని నిధులను సమీకరిస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పటి వరకు రూ.9 వేల కోట్లు వ్యవసాయ శాఖకు ఇచ్చినట్లు తెలిపారు.. మిగతా నిధులు కూడా పలు వనరుల ద్వారా సేకరించి వ్యవసాయ శాఖకు అందజేస్తామని పేర్కొన్నారు.
ఆరునూరైనా.. నూరుఆరైనా ఆగస్ట్ 15 లోపు రుణ మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు రుణ మాఫీ నిధులు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ హామీని అమలు చేసేందుకు తీవ్రంగా పని చేస్తోంది. రైతు రుణమాఫీతో పాటు, రైతు భరోసా, రైతు బీమా పథకాలకు కూడా దాదాపు రూ.40 వేల కోట్లు డబ్బు అవసరం. వీటిని సేకరించేందుకు అనే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.

జులై, ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయంపై దాదాపు రూ.15 వేల కోట్ల నుంచి 18 వేల కోట్లు తీసుకునేందుకు రెడీ అయినట్లు సమాచారం. టీజీఐఐసీ ద్వారా భూములను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసా ఎలా అమలు చేయాలనే దానిపై మంత్రుల సబ్ కమిటీ చర్చలు జరుపుతోంది. దీనిపై రైతులు, రైతు సంఘాలు, మేధావుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు. బుధవారం ఖమ్మం నుంచే రైతు సమావేశాల నిర్వహణ ద్వారా అభిప్రాయ సేకరణకు శ్రీకారం చుడుతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
ఈ పథకం ఉద్దేశమే పెట్టుబడి సాయమని.. వ్యవసాయం చేయని వారికి ఎందుకు ఇవ్వాలని మంత్రి ప్రశ్నించారు. సన్న చిన్నకారు రైతుల వరకే అవసరమని భావిస్తున్నట్లు చెప్పారు. తన కుటుంబానికి వచ్చిన రైతుబంధు సాయం తీసుకోవడం లేదని.. చెక్కులు వాపస్ చేసినట్లు పేర్కొన్నారు. రైతు భరోసా ఇచ్చేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తామని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications