మరోసారి తెలంగాణ శాసనమండలి ఛైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి: మంత్రి పదవి కలగానే!
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ఛైర్మన్గా ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. సుఖేందర్ రెడ్డి ఒక్కరే నామినేషన్ వేయడంతో మండలి ఛైర్మన్గా ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఎన్నిక అనంతరం సుఖేందర్ రెడ్డి ఛైర్మన్ స్థానంలో కూర్చున్నారు. ఆయనకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి సేవలను మంత్రులు కొనియాడారు.
గత జూన్ మొదటిసారి మండలి ఛైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి
కాగా, గత జూన్ మొదటి వారం వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్గా సేవలందించారు. గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో.. ప్రోటెం చైర్మన్గా మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అయితే భూపాల్ రెడ్డి పదవీకాలం కూడా ముగిసింది. అయితే ప్రస్తుతం ఎంఐఎం సభ్యుడు సయ్యద్ ఖాద్రీ మండలి ప్రొటెం చైర్మన్గా వ్యవహరిస్తున్నారు.
కేసీఆర్ నిర్ణయంతో మరోసారి మండలి ఛైర్మన్గా గుత్తా
గుత్తా సుఖేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ మరోసారి మండలి సభ్యునిగా అవకాశం కల్పించారు. గతేడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. దీంతో ఆయనకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే గతంలో మండలి చైర్మన్గా పనిచేసిన అనుభవం ఉన్న గుత్తాకు.. మరోసారి మండలి చైర్మన్గా ఎన్నుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే, గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తూ మరోసారి శాసనమండలి ఛైర్మన్ గా నామినేషన్ వేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్కు గుత్తా సుఖేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Recommended Video
గుత్తా సుఖేందర్ రెడ్డికి కలగానే మంత్రి పదవి?
ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి మరోసారి శాసన మండలి చైర్మన్ పదవి చేపడుతుండడంతో అధికార పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన కేబినెట్ బెర్తును గుత్తాకు కేటాయిస్తారని.. మండలి చైర్మన్ పదవిని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనా చారికి అప్పగిస్తారని చివరి నిమిషం వరకు ప్రచారం జరిగింది.
అయితే, మండలి చైర్మన్ గా గుత్తా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అయితే కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి సీనియర్ రాజకీయ నేత అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి క్యాబినెట్లో బెర్త్ ఆశించారు. ఎప్పటి నుంచో మంత్రి పదవిపైన ఆశలు పెట్టుకున్న ఆయనకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ హోదా లభిస్తుందని ఆయన వర్గీయులు భావించారు.
ఎప్పుడూ ప్రజాక్షేత్రంలో ఉండేందుకు ఇష్టపడే సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన తొలినాళ్లలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత శాసనమండలి ఛైర్మన్ పదవికి పరిమితిమయ్యారు. దీంతో గుత్తా వర్గీయులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.