ఎంజాయ్ చేద్దామని పబ్ కళ్తే.. అమ్మాయిలనూ కొట్టి పంపారు!
సరదాగా గడపాలని పబ్ కెళ్లిన యువతీయువకులపై బౌన్సర్లు దాడి చేశారు. అమ్మాయిలని కూడా చూడకుండా వారిపైనా దాడికి పాల్పడ్డారు.
హైదరాబాద్: సరదాగా గడపాలని పబ్ కెళ్లిన యువతీయువకులపై బౌన్సర్లు దాడి చేశారు. అమ్మాయిలని కూడా చూడకుండా వారిపైనా దాడికి పాల్పడ్డారు. దీంతో బాధిత యువతీయువకులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అరెస్ట్ చేశారు.
జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సామల వెంకటరెడ్డి కథనం ప్రకారం.. అల్వాల్ చైతన్యనగర్ ప్రాంతానికి చెందిన విద్యార్థి వి.నవనీత్రెడ్డి(21) గత నెల 20న సోదరుడు వినీత్రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్ రోడ్డు నం.36లోని హైలైఫ్ బ్రీవింగ్ కంపెనీ(జూబ్లీ 800 పబ్))కు వచ్చారు. వీరితో నవనీత్రెడ్డి ఇద్దరు సోదరీమణులు, బావమరిది అర్జున్సింహారెడ్డి, మరో ఇద్దరు ఉన్నారు.
అంతా కలిసి డ్యాన్సింగ్ స్టేజిపైకి వెళ్లడానికి ప్రయత్నించగా కొందరు బౌన్సర్లు వారిని అడ్డుకుని, వారిని వెళ్లిపోవాలని కోరారు. 15నిమిషాల్లో వెళ్తామని చెప్పినా వినకపోగా ఇతర బౌన్సర్లను పిలుచుకుని వచ్చి అర్జున్ సింహారెడ్డితోపాటు అమ్మాయిలనూ కొట్టారు. దాడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
ఆ తర్వాత జరిగిన ఘటనపై నవనీత్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితులు కాచిగూడ చప్పల్బజార్కు చెందిన నందు ఠాకూర్(28), సూలం రాముయాదవ్ (28), వారాసీగూడ అంబర్నగర్కు చెందిన దొడ్డి ప్రమోద్(27), అడిక్మెట్ లలితనగర్కు చెందిన చిలుగూరు మధు(21), మెట్టుగూడకు చెందిన బంగారు విజయ్కుమార్(23), గంగపుత్ర కాలనీకి చెందిన పూస సంతోష్(37)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.