డేటా చోరీ ఇష్యూ: హైకోర్టులో ఐటీ గ్రిడ్ పిటిషన్, నలుగురు ఉద్యోగుల్ని రేపు ప్రవేశపెట్టండి
హైదరాబాద్: డేటా చోరీ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ పైన హైకోర్టులో ఆదివారం విచారణ జరిగింది. ఐటీ గ్రిడ్ కంపెనీ నలుగురు ఉద్యోగస్తులను రేపు హైకోర్టులో తమ ముందు హాజరుపరచాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఉద్యోగులు భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్లను అక్రమంగా నిర్బంధించినట్లు ఈ పిటిషన్లో పేర్కొన్నారు.
అంతకుముందు, నలుగురు సహచర ఉద్యోగులను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన అశోక్ తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. రేగొండ భాస్కర్, ఫణి కడలూరి, గురుడు చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ను పోలీసులు నిర్బంధించారంటూ పిటిషన్లో పేర్కొన్నారు.

నలుగురు ఉద్యోగులను వెంటనే కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఇవాళ, రేపు హైకోర్టు సెలవులు ఉన్న నేపథ్యంలో ఇంట్లోనే విచారణ జరపాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న హైదరాబాద్లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో సైబరాబాద్ పోలీసులు శనివారం సాయంత్రం సోదాలు నిర్వహించారు. హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈ సంస్థ... టీడీపీకి యాప్ తయారు చేసి ఇచ్చిందని, దీనిలో ఓటర్లు, వారి ఆధార్ కార్డుల వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications