తెలంగాణకు భారీ వర్ష సూచన- ఆ జిల్లాలకు హెచ్చరికలు
తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు శుక్ర, శనివారాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని అధికారులు స్పష్టం చేశారు.
ఇక కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో శుక్రవారం భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. మరోవైపు గురువారం పిడుగుపాటు గురై రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల ఇద్దరు మరణించారు.
జనగామ జిల్లా లింగాలగణపురం మండలం నేలపోగులలో మందాడి రవీందర్ రెడ్డి అనే రైతు పిడుగు పడి మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్దాపూర్లో సంతోష్ అనే విద్యార్థి పిడుగుపాటుతో మరణించాడు. కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన సంతోష్ అనే విద్యార్థి కూడా పిడుగుపాటుతో మృతి చెందాడు.

మరోవైపు ఏప్రిల్ 13 నుంచి 16 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ రోజుల్లో ఎలాంటి హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. అయితే ఆదివారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతల్లో మార్పులు ఉండనున్నాయి. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications