అమ్మానాన్నలకు ‘సారీ’: స్నేహితులు వేధిస్తున్నారని విద్యార్థి ఆత్మహత్య
తోటి మిత్రులు అవమానపర్చడం, ఆర్మీ ఉద్యోగం సాధించలేనేమోననే బెంగ ఆ విద్యార్థిని బలవన్మరణానికి ప్రేరేపించాయి.
వరంగల్: తోటి మిత్రులు అవమానపర్చడం, ఆర్మీ ఉద్యోగం సాధించలేనేమోననే బెంగ ఆ విద్యార్థిని బలవన్మరణానికి ప్రేరేపించాయి. వరంగల్ జిల్లా హన్మకొండలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న చిమ్మని సందీప్ (16) ఆదివారం రైలుకిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కుటుంబసభ్యులు, మృతుడి సూసైడ్ నోటు వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన సందీప్.. హన్మకొండలో ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో చదువుతున్నాడు. తన క్లాస్మేట్స్లోని ముగ్గురు కొద్దిరోజులుగా తరుచూ అవమానాలకు గురిచేస్తూ వేధిస్తున్నారు. మాట్లాడితే దాడి చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో తీవ్రమనస్తాపం చెందాడు.
తనతో ఉన్న మరో ఇద్దరు స్నేహితులు కూడా సందీప్పై పగపెంచుకున్న వారితో స్నేహం చేస్తుండటంతో మరింత కలత చెందాడు. తాను ఏ తప్పు చేయలేదని.. మామ, అమ్మానాన్న తనను క్షమించాలని.. తమ్ముడు, చెల్లి బాగా చదువుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. ముగ్గురు వ్యక్తుల వల్ల మనస్తాపం చెంది మరణాన్ని ఆశ్రయిస్తున్నానంటూ రాసిన సూసైడ్ నోట్ను తన బ్యాగులో పెట్టి శనివారం కళాశాల నుంచి అదృశ్యమయ్యాడు. దీనిపై యాజమాన్యం.. తల్లిదండ్రులకు తెలిపి, హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, సందీప్ ఆదివారం ఉదయం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన చూసిన వారు అక్కడి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి ఆనవాళ్లు, చిరునామా ఆధారంగా జీఆర్పీ ఉద్యోగులు కుటుంబసభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు సందీప్ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. గాంధీ ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురానున్నట్లుగా కుటుంబసభ్యులు తెలిపారు.