కేంద్రమే అప్పు తీసుకుని పరిహారం చెల్లించాలి, ఆత్మనిర్బర్తో ముడిపెట్టొద్దు: హరీశ్ రావు
న్యూఢిల్లీ/హైదరాబాద్: జీఎస్టీ పరిహారం చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లు ఏ మాత్రం సమ్మతం కాదని, కేంద్రమే అప్పుతీసుకుని రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 42వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి హరీశ్ రావు పాల్గొన్నారు. జీఎస్టీ పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ద హక్కు అని వ్యాఖ్యానించారు. కరోనా పరిస్థితుల్లో జీఎస్టీ పరిహారం మొత్తం రాష్ట్రాలకు చాలా అవసరమని అన్నారు.
అంతేగాక, ఆత్మ నిర్బర భారత్ ప్యాకేజీ కింద రాష్ట్రాలకు ఇచ్చిన రుణ పరిమితికి, జీఎస్టీ పరిహారం చెల్లింపులకు ముడిపెట్టవద్దని మంత్రి హరీశ్ రావు కోరారు. అటు ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన మొత్తాన్ని కూడా వెంటనే చెల్లించాలన్నారు. ఐజీఎస్టీ కింద తెలంగాణకు రావాల్సిన రూ.2638 కోట్లు వెంటనే విడుదల చేయాలి అని మంత్రి హరీష్ రావు ఐజీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Recommended Video
కాగా, జీఎస్టీ పరిహారం విషయంలో తెలంగాణ మంత్రి అభిప్రాయాలనే పశ్చిమబెంగాల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా వ్యక్తం చేశాయి. దీంతో ఈ సమావేశంలో పరిహారం చెల్లింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సంప్రదింపులు కొనసాగించేందుకు అక్టోబర్ 12న మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. కాగా, ఐజీఎస్టీ కింద రూ. 24వేల కోట్లను వారంలోపు రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.