టిడిపి నేతలకు తెలిసింది, అందుకే భయం: హరీష్, సర్వే నామినేషన్
వరంగల్: తెలంగాణలో పోటీ చేసేందుకే తెలుగుదేశం పార్టీ నేతలు భయపడిపోతున్నారని, తమది ఆంధ్రా పార్టీ అని, తమకు ఎవరూ ఓటు వేయరని వారికి కూడా అర్థమైందని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు ఎద్దేవా చేశారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో వరంగల్లో జరిగిన బహిరంగ సభలో హరీష్ రావు మాట్లాడారు. వరంగల్ ప్రజలు కష్టపడే వారికి ఓటేస్తారన్నారు. తెలంగాణ రావాలని గోడల మీద రాత్రుళ్లు రాసిన దయాకర్కు తమ పార్టీ టిక్కెట్ ఇచ్చిందని, ఆయనను గెలిపించాలన్నారు.
ఇతర పార్టీల అభ్యర్థులకు వరంగల్ ఎల్లలు కూడా తెలియవన్నారు. వరంగల్ ఉప ఎన్నిక పోటీ నామమాత్రమేనని, మెజార్టీ కోసమే మనం కష్టపడాలన్నారు. ప్రతిపక్షాల నోళ్లు మూతపడేలా మెజార్టీ ఇవ్వాలన్నారు. కాకతీయ తోరణాన్ని అధికార చిహ్నంలో పెట్టి వరంగల్ పైన గౌరవాన్ని కెసిఆర్ చాటారన్నారు.
మిషన్ కాకతీయ అనే పేరుతో చెరువుల పునరుద్ధనను ప్రారంభించామని, తద్వారా కాకతీయ సామ్రాజ్యాన్ని గుర్తు చేస్తున్నామన్నారు. వరంగల్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పెట్టామని, పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేశామన్నారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపిలు తుమ్మచెట్లు ఇస్తే టీఆర్ఎస్ నీళ్లు ఇస్తుందన్నారు.
టిడిపి నేతలు పోటీ చేసేందుకే భయపడుతున్నారని చెప్పారు. అందుకే మెదక్ ఉప ఎన్నిక టిక్కెట్, హైదరాబాద్ ఎమ్మెల్సీ టిక్కెట్, ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నిక టిక్కెట్ బిజెపికే ఇచ్చిందన్నారు. తెలంగాణకు కరెంట్ రాకుండా అడ్డుకున్న పార్టీలు టిడిపి, బిజెపి అన్నారు. ఇప్పుడు అభివృద్ధిని కూడా అడ్డుకుంటున్నాయన్నారు.
మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్, రోడ్ల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపడుతుంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. వారికి ప్రజల తీర్పు గుణపాఠం కావాలన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థి దయాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థిగా సర్వే నామినేషన్
రాజయ్య కోడలు, మనవళ్ల మృతి, వరంగల్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజయ్య నిరాకరించిన నేపథ్యంలో మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగారు. సర్వే బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు బిజెపి అభ్యర్థి దేవయ్య కూడా నామినేషన్ దాఖలు చేశారు.