వరంగల్లో హరీష్ రావుకు చేదు, కెటిఆర్-కవితలకు బిజెపి రివర్స్ పంచ్
వరంగల్: మంత్రి హరీష్ రావుకు వరంగల్ జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వరంగల్ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం ఆయన ఎంహెచ్ నగర్లో పర్యటిస్తున్నారు. అయితే, ఆయనను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎస్సీల వర్గీకరణ పైన తమకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దాంతో, పరిస్థితి సద్దుమణిగింది.
మరోవైపు, ప్రచార భాగంగా హరీష్ రావు మాట్లాడుతూ... టీడీపీ, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. ఓటర్లకు డబ్బులు ఇచ్చి కొనాలని ఆ పార్టీలు చూస్తున్నాయన్నారు. ఈ పార్టీల పాచిక పారదని, టీఆర్ఎస్ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.
కెటిఆర్ విదేశాల నుంచి వచ్చి పోటీ చేయలేదా?: బిజెపి
వరంగల్ ఉప ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిని టిఆర్ఎస్ నాయకులు ఎన్నారై అని విమర్శిస్తున్న నేపథ్యంలో... దానిపై బిజెపి నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కెటిఆర్ మెదక్లో పుట్టి, అమెరికాలో ఉండి, సిరిసిల్ల నుంచి పోటీ చేయలేదా అని బిజెపి అధ్యక్షులు కిషన్ రెడ్డి నిలదీశారు.
కవిత విదేశాల నుంచి వచ్చి నిజామాబాద్ నుంచి ఎన్నికల్లో నిలబడలేదా అన్నారు. ఇతర పార్టీల నుంచి తీసుకు వెళ్లి మంత్రి పదవులు ఇస్తే తప్పులేదు కానీ, వరంగల్ గడ్డ పైన పుట్టిన దేవయ్యను తమ పార్టీ అభ్యర్థిగా నిలబెడితే విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. దేవయ్య సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్నారన్నారు.
కెటిఆర్, కవిత, హరీష్ రావులు ఎవరికి సేవ చేశారని ప్రశ్నించారు. కెసిఆర్కు రాజకీయ నైతిక విలువలు ఉంటే తెలంగాణ ద్రోహులను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చేవారు కాదన్నారు. ఉద్యమంలో పని చేసిన వారికి మొండిచేయి చూపారన్నారు.
టిఆర్ఎస్ అహంకార వైఖరికి ప్రజలు బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి మంగళవారం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీకి మేలు చేయవద్దన్నారు. తమ అభ్యర్థి దేవయ్యకు కెసిఆర్ కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. 99 శాతం హామీలు అమలు చేశామన్న ప్రకటనకు కెసిఆర్ కట్టుబడ్డారా అన్నారు. తాను ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని ఎన్డీయే అభ్యర్థి దేవయ్య అన్నారు.
కెసిఆర్ నియంతృత్వ పాలన: చాడ
తెలంగాణలో కెసిఆర్ నియంతృత్వ పాలన సాగుతోందని సిపిఐ నేత చాడ వెంకట రెడ్డి హైదరాబాదులో మండిపడ్డారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కెసిఆర్ పరామర్శించక పోవడం విడ్డూరమన్నారు. ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
డిసెంబర్ 26వ తేదీ నుంచి గ్రామాల్లో తిరిగి బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని సిపిఐ నేత నారాయణ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వల్లే గత లోకసభ ఎన్నికల్లో బిజెపి గెలిచిందన్నారు. కార్పోరేట్ కంపెనీల వల్లే ప్రభుత్వం నడుస్తుందని ఆరోపించారు. బీహార్ ప్రజల తీర్పుతోనైనా ప్రధాని మోడీ కళ్లు తెరవాలన్నారు.