బకరా మంత్రి అనుకున్నావా?: హరీశ్ రావు ఆగ్రహం
మెదక్: తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావుకు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఆగ్రహం తెప్పించారు. బుధవారం మెదక్ జిల్లా కల్హేర్ మండలం సిర్గాపూర్లో హరితహారం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం మంత్రి హరీశ్.. రాపర్తిలో విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించేందుకు బయలుదేరారు.
కాగా, మార్గమధ్యలోని నల్లవాగు గురుకుల పాఠశాల వద్ద ప్రిన్సిపాల్ మెవాబాయి, విద్యార్థులు మంత్రి కాన్వాయ్ని నిలిపారు. పాఠశాలలో మొక్కలు నాటాలని కోరారు. దీంతో మంత్రి హరీశ్రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి వాహనం దిగి మొక్కలు నాటేందుకు వెళ్లారు.
అయితే, అక్కడ పారా, నీరు కూడా అందుబాటులో లేవు. గోతులు కూడా తీసిలేవు. దీంతో మంత్రి ఆగ్రహంతో వెనుదిరుగుతూ 'బకరా మినిస్టర్ అనుకుంటున్నారా?.. ఇవేనా ఏర్పాట్లు?' అంటూ ప్రిన్సిపాల్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ప్రిన్సిపాల్ ప్రాధేయపడటంతో మంత్రి హరీశ్ రావు స్వయంగా మట్టిని తీసి గుంతలో మొక్కను నాటారు.