టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ముచ్చట్లు: తలపట్టుకున్న హరీష్ రావు!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు బుధవారం నాడు తల పట్టుకున్నారట! రైతుల రుణాలను ఒకేదఫా మాఫీ చేయాలనే విపక్షాలు డిమాండ్ చేయడంతో... వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు.
ఈ నేపథ్యంలో సభలో అధికార పార్టీ సభ్యులతో పాటు మజ్లిస్ పార్టీ సభ్యులు మాత్రమే మిగిలారు. అయితే, మంగళవారం, బుధవారం కనీసం అధికార పార్టీ సభ్యుల సీట్లు కూడా పూర్తిగా నిండలేదని తెలుస్తోంది. అధికార పక్షానికి చెందిన సీట్లైనా నిండితే సభ కొద్దిమేరకైనా నిండినట్లు కనిపిస్తుంది.
సభలో మిషన్ కాకతీయపై చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో అధికార పార్టీ సభ్యులకు చెందిన సీట్లు కూడా ఖాళీగా కనిపించాయి. దీనిని గమనించిన హరీశ్ రావు... ఎమ్మెల్యేలంతా ఎక్కడికెళ్లారంటూ ఆరా తీశారు.
చర్చకు డుమ్మా కొట్టి లాబీలకు చేరిన ఎమ్మెల్యేలు ముచ్చట్లాడుకుంటున్నారని తెలిసిన ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదని తెలుస్తోంది. కాసేపు వేచి చూసిన హరీష్ రావు... ఆ తర్వాత ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ను ఎమ్మెల్యేల వద్దకు పంపించారు. హరీశ్ ఆగ్రహం గురించి తెలియగానే వారు తిరిగి సభకు వచ్చారంటున్నారు.
టిడిపి, కాంగ్రెస్ పాలకులపై కెసిఆర్ ఆగ్రహం
ఉమ్మడి రాష్ట్రంలో యాభై ఎనిమిదేళ్ల పాటు అరాచక పాలన సాగిందని, రాష్ర్టాన్ని నాశనం చేశారని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మండిపడ్డారు. దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని ఇన్నేళ్లలో నాశనం చేసినవారు పదిహేను నెలల్లో మీరేమీ చేయలేదని అడిగితే ఎలా అన్నారు.
వాళ్లు నాశనం చేసిన రాష్ర్టాన్ని బాగుచేసేందుకు తాము కొత్త చరిత్ర ప్రారంభించామన్నారు. త్వరలోనే నీటిపారుదల రంగంలో విప్లవాన్ని చూడబోతున్నామన్నారు. పనికిరాని గత పాలకులు, వారి అసమర్థత, అవివేకమైన పాలన రైతుల ఆత్మహత్యలకు కారణమని చెప్పారు.
ప్రస్తుతం రాష్ర్టానికి పునాది వేస్తున్నామన్న సీఎం.. పునాది దశలో తప్పు జరిగితే రాష్ట్రం నష్టపోతుందన్నారు. ఆలస్యమైనా సరే సరైన నిర్ణయాలే తీసుకుంటామన్నారు. అంతేకానీ తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ నిర్ణయాల్లో తప్పు జరుగబోదన్నారు.
రూ.33,982 కోట్లు కేటాయించి దేశంలోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్వన్ అని ఆయన సగర్వంగా చెప్పారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెచ్చుకున్నామని, ప్రజల ప్రయోజనాలు నెరవేర్చడానికి అహోరాత్రులు కష్టపడుతున్నామన్నారు. అసెంబ్లీలో బుధవారం సంక్షేమ రంగంపై చర్చ సమయంలో టిడిపి, కాంగ్రెస్ పాలకుల పైన కెసిఆర్ నిప్పులు చెరిగారు.