రేవంత్ కోటాలో పాగా వేసేందుకు కేసీఆర్ ప్లాన్, హరీష్కు బాధ్యత, టీఆర్ఎస్ రేసులో వీరే
రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగితే పోటీకి దిగాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ఆమోదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగితే పోటీకి దిగాలని టీఆర్ఎస్ నిర్ణయించింది.
ఇందుకోసం అప్పుడే కసరత్తు ప్రారంభించింది. కొడంగల్ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యనేతలతో చర్చించారని సమాచారం. రేవంత్ రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు అనివార్యమవుతాయని, అక్కడ పోటీ చేసి తప్పనిసరిగా గెలవాలని సూచించారు.
Recommended Video


కొడంగల్ బాధ్యతలు మంత్రి హరీష్ రావుకు
కొడంగల్ విషయంలో వ్యూహరచన బాధ్యతలను మంత్రి హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ అప్పగించారు. మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేందర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులతో హరీశ్ రావుచర్చించారు.

కొడంగల్లో పాగా వేసేందుకు ఏం చేద్దాం
మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి భేటీలో పాల్గొన్నారు. కొడంగల్లో పాగా వేసేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రేవంత్ పైన గెలుపొందేందుకు ఎలా ముందుకెళ్దామనే అంశాలను చర్చించారు. ఇప్పటికే కొడంగల్ విషయంలో పలు అంశాలను ఖరారు చేశారని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో మరోసారి భేటీ కానున్నారు.

టీఆర్ఎస్ తరఫున పోటీలో వీరు
కొడంగల్లో పోటీకి తన తనయుడికి అవకాశం ఇవ్వాలని గుర్నాథ్ రెడ్డి మంత్రి కేటీఆర్ను కోరినట్లుగా తెలుస్తోంది. కాగా, కొడంగల్లో టీఆర్ఎస్ తరఫున మంత్రి మహేందర్ రెడ్డి తమ్ముడు, ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డిలను బరిలో నిలిపే అవకాశాలు కూడా లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.

కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి
మంగళవారం ఢిల్లీలో రేవంత్తో పాటు మరికొందరు టీడీపీ నేతలు కాంగ్రెస్లో చేరనున్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు భట్టి జగపతి, ఆదిలాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల టీడీపీ అధ్యక్షులు సోయం బాబూరావు, బోడ జనార్దన్, సుభాష్రెడ్డి, శశికళా యాదవ్, అరికెల నర్సారెడ్డి, విజయ రమణారావు, కవ్వంపల్లి సత్యనారాయణలతో పాటు చొప్పదండి, ఆర్మూర్ నియోజకవర్గాల ఇంచార్జులు మేడిపల్లి సత్యం, రాజారాం యాదవ్ తదితరులు కాంగ్రెస్లోకి వెళ్తున్నారు.

అన్నపూర్ణమ్మ ఎటువైపు?
మాజీ ఎమ్మెల్యే సీతక్క కూడా మంగళవారం ఉదయం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఆమె కూడా కాంగ్రెస్లో చేరనున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, ఆమె తనయుడు మల్లికార్జున్ రెడ్డి కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్లో చేరే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications