బీజేపీ, కేంద్రంపై నిప్పులు చెరిగిన హరీశ్ రావు: ఏం తాపించారోనంటూ ఈటల రాజేందర్పై సెటర్లు
కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు. బడ్జెట్పై శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో హరీశ్ రావు మాట్లాడారు
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, బీజేపీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు. బడ్జెట్పై శాసనసభలో బుధవారం జరిగిన చర్చలో హరీశ్ రావు మాట్లాడారు. రూ. 5,375 కోట్లు ఇవ్వాలని ఫైనాన్స్ కమిషన్ చెప్పినా కేంద్రం తెలంగాణకు ఇవ్వడం లేదని ఆరోపించారు. కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదని, వివిధ రూపాల్లో కేంద్రం నుంచి రూ. 1.25 లక్షల కోట్లు రావాలని హరీశ్ రావు చెప్పారు. బీజేపీ దేశ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.

బీజేపీ అమృత్ కాల్.. ప్రజలకు ఆపద కాలమన్న హరీశ్
మిషన్ భగీరథ పథకం రూపంలో దేశం ముందు ఒక నమూనా నిలిపామని చెప్పిన హరీశ్ రావు.. తెలంగాణను చూసి కేంద్రం ప్రారంభించిన హర్ ఘర్ జల్ అమృత్ కాల్ సవ్యంగా సాగడం లేదన్నారు. అమృత్ కాల్ అని చెబుతున్న బీజేపీ పాలన దేశ ప్రజలకు ఆపద కాలం వస్తోందని విమర్శించారు. గోదావరి జలాలను 600 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ సర్కారుదేనని అన్నారు. ప్రపంచమే ఆశ్చర్యపడే కాళేశ్వరం ప్రాజెక్టును మూడున్నరేళ్లలోనే నిర్మించామన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హరీశ్ రావు
జీడీపీని మంటగలపడంలో బీజేపీ సక్సెస్ అయిందని హరీశ్ రావు విమర్శించారు. ఫుడ్ సెక్యూరిటీని నాశనం చేయడంలో, రూ. 160 లక్షల కోట్ల అప్పులు చేయడంలో, సెస్సుల రూపంలో అడ్డగోలుగా పన్నులు వేయడంలో, సిలిండర్ ధరలు పెంచడంలో, పసి పిల్లలు తాగే పాల మీద కూడా జీఎస్టీ విధించడంలో, ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టడంలో, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడంలో, రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కాలరాయడంలో, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడంలో, అదానీ ఆస్తులు పెంచడంలో, మతపిచ్చి మంటలు రేపడంలో బీజేపీ ప్రభుత్వం సక్సెస్ అయిందంటూ హరీశ్ రావు నిప్పులు చెరిగారు.

ప్రజలకు పవర్ ఇస్తే.. వారు పవర్ ఇచ్చారన్న హరీశ్
దేశానికే ఆదర్శంగా మారిన తెలంగాణ ప్రగతి విపక్షాలకు కనబటం లేదు.. విబడటం లేదని హరీశ్ రావు విమర్శించారు. ప్రజలకు కావాల్సినంత పవర్ ఇచ్చినందుకే తమకు పవర్ ఇచ్చారని మంత్రి చెప్పారు. ప్రజలకు తాము నిరంతరం పవర్ ఇస్తామని, ప్రజలు కూడా తమకే పవర్ ఇస్తారని వ్యాఖ్యానించారు. పవర్ హాలీడే ఇచ్చారు కాబట్టే.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు హాలీడే ఇచ్చారని ఎద్దేవా చేశారు మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం సరిపడా నీళ్లు, నిధులు ఇస్తోందని రైతులు సంబరపడుతున్నారని అన్నారు. వాళ్లకు ఎప్పటికీ పవర్ రానట్లుందని విపక్షాలకు బాధ కలుగుతోందని ఎద్దేవా చేశారు.

ఏ కషాయం తాపించారో..: ఈటలపై హరీశ్ రావు సెటైర్లు
మరోవైపు, ఈటలు రాజేందర్పైనా హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ఈటల రాజేందర్ మా దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉండే.. ఆ పార్టీలోకి పోయినకా ఏమైందో ఏమో? మా దగ్గర ఉన్నప్పుడు జన్ కీ బాత్ వినే ఈటల.. ఇప్పుడు మన్ కీ బాత్ వింటున్నాడు అంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. కాషాయ పార్టీలో చేరిన తర్వాత ఏం కషాయం తాపించారో అని చురకలంటించారు. కేసీఆర్ ఫాంహౌస్ లో క్షుద్రపూజలంటూ ఆరోపణలు చేస్తున్నారని.. అక్కడ జరిగింది కపిల గోవుకు కేసీఆర్ చేసిన పూజ అని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే క్షుద్రపూజలు జరుగుతాయని విమర్శించారు.












Click it and Unblock the Notifications