మీ రాజకీయాల కోసమా?: బాబు-జగన్ల దుమ్ముదులిపిన హరీష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిల పైన తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శనివారం నాడు తీవ్రంగా మండిపడ్డారు. వెయ్యిమంది జగన్లు వచ్చినా పాలమూరును అడ్డుకోలేరన్నారు.
ప్రజల కష్టాలను గట్టెక్కించేలా తాము చేపట్టిన ప్రాజెక్టులను ఏపీ నేతలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శిస్తున్నారన్నారు. తాము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు ప్రాజెక్టుపై ఏపీ సీఎం చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ విమర్శలు గుప్పిస్తూ రాజకీయం చేస్తున్నారన్నారు.
ఏపీలో వైసిపి, టిడిపిలు రాజకీయ విమర్శలు చేసుకుంటూ.. మధ్యలో తెలంగాణ ప్రాజెక్టులను ఉపయోగించుకోవడం ఏమిటన్నారు. ప్రజాక్షేమాన్ని కోరుకునే వారు పాలమూరు ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటారన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి నడిచిన దారిలోనే జగన్ నడుస్తున్నారన్నారు. చంద్రబాబు, జగన్ తెలంగాణ ప్రాజెక్టుల జోలికి రావద్దని సూచించారు. వందమంది చంద్రబాబులు, వెయ్యిమంది జగన్లు అడ్డుకున్నా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ఎంతమాత్రం ఆగబోదన్నారు.
ఏపీ నాయకులు ఈ ప్రాజెక్టును ఆడ్డుకోవటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. రాజకీయాల కోసం పాలమూరుతో ఆటలాడితే సహించమని హెచ్చరించారు. జగన్ పాలమూరు ఎత్తిపోతలకు వ్యతిరేకంగా ఈ నెల 16నుంచి మూడురోజులు దీక్షలు చేపడతానని ప్రకటించటం హాస్యాస్పదమన్నారు.
మరోవైపు చంద్రబాబు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి సీడబ్ల్యుసీకి రోజుకో లేఖ రాయడం, కొంతమంది రైతులను ఢిల్లీకి పంపి ప్రాజెక్టుకు విరుద్ధంగా సుప్రీంకోర్టులో కేసులు వేయించడం వంటి చర్యలకు దిగుతున్నాడన్నారు.