ఆసక్తికరం: తెలంగాణ అసెంబ్లీలో 'జగన్' పై హరీష్ రావు కామెంట్స్!
ఒకసారి పక్క అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూడాలని, ప్రతిపక్ష నేత(జగన్) మైకును ఎన్నిసార్లు కట్ చేస్తున్నారో చూడాలని విపక్ష సభ్యులకు హరీష్ రావు సూచించారు.
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాల పాలనను పోల్చి చూసుకునే పరిస్థితి ఏర్పడింది. రాజకీయాలు, ప్రభుత్వ తీరు తెన్నులు.. ఇలా ప్రతీ విషయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య పరిణామాలను చాలామంది బేరీజు వేస్తున్నారు. ఆఖరికి ప్రభుత్వంలోని నేతలు సైతం ఈ విషయాలను ప్రస్తావిస్తుండటం విశేషం.
తాజాగా తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు నేటి సభలో పక్క రాష్ట్ర ప్రస్తావన తీసుకొచ్చారు. విపక్ష సభ్యులకు నచ్చజెప్పే క్రమంలో.. ఒకసారి పక్క అసెంబ్లీలో ఏం జరుగుతుందో చూడాలని, ప్రతిపక్ష నేత(జగన్) మైకును ఎన్నిసార్లు కట్ చేస్తున్నారో చూడాలని సూచించారు. అక్కడి ప్రభుత్వంతో పోల్చితే సభలో మాట్లాడేందుకు విపక్షాలకు తామే ఎక్కువ అవకాశమిస్తున్నామని హరీశ్ ఈ సూచన ద్వారా పరోక్షంగా చెప్పుకొచ్చారు.
కాగా, ఈ ఉదయం తెలంగాణ శాసనసభ ప్రారంభమైన తర్వాత అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి.. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆరోపించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామని, మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలను తెలియజేసే బాధ్యత తమకుందని, తాము వేరే అంశాలను ప్రస్తావించడం లేదని గుర్తుచేశారు. సీఎల్పీ నేత జానారెడ్డి కూడా కిషన్ రెడ్డితో జతకలిశారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదని నిరసన తెలిపారు. విపక్ష సభ్యుల తీరును తప్పుపడుతూ మంత్రి హరీష్ రావు వివరణ ఇచ్చారు.
బడ్జెట్ చర్చ సందర్బంగా 6.35గం. టీఆర్ఎస్ మాట్లాడితే, 7.30గం. కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందని గుర్తుచేశారు. ప్రతిపక్షం మీదున్న గౌరవంతోనే తాము విపక్ష సభ్యులకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చామని అన్నారు. గౌరవనీయులైన ప్రతిపక్ష నేత సూచనల మేరకు అన్ని పద్దులను తీసుకుంటామని నిన్నటి సభలో ప్రకటించామని, అనంతరం సభ వాయిదా వేశామని అన్నారు.
అయితే ఆ సమయంలో ఆయన చుట్టూ ఇతర సభ్యులు ఉండటంతో తమ మాట ఆయనకు వినపడకపోయి ఉండవచ్చునని పేర్కొన్నారు. ఇదే సందర్బంలో ఒకసారి పక్క రాష్ట్ర అసెంబ్లీ జరుగుతున్న తీరును పరిశీలించాలని విపక్ష సభ్యులకు హరీష్ రావు సూచించారు.