బసవేశ్వరుడి సేవలో తెలంగాణ మంత్రి హరీష్ రావు
బెంగళూరు: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదివారం కర్ణాటకలో పర్యటించారు. బీదర్ జిల్లా బసవ కల్యాణలో ఆయన ధార్మిక మహోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బసవ ధర్మ ట్రస్ట్ ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కన్నడిగుల ఆరాధ్య దైవం బసవేశ్వరుడి జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఆయన జన్మస్థలం బసవ కల్యాణలో కొద్దిరోజులుగా ధార్మిక మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. భాల్కీ మఠం, అనుభవ మంటప బసవలింగ పట్టదేవరు ఆధ్వర్యంలో బసవ ధర్మ ట్రస్ట్, అనుభవ మంటప సంయుక్తంగా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేశాయి. శనివారం ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభం అయ్యాయి.

ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా వచన కల్యాణ-తాత్విక చింతన అంశంపై ధార్మిక సదస్సును నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యారు. ఈ ఉదయం టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ తో కలిసి బసవ కల్యాణకు వచ్చిన హరీష్ రావును భాల్కీ మఠం ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయబద్ధంగా ఆయనకు విబూథిని పూసి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్విక చింతన కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడారు. తొలుత కొద్దిసేపు ఆయన కన్నడంలో మాట్లాడారు. అనంతరం తెలుగు, హిందీ భాషల్లో ప్రసంగించారు. బసవేశ్వరుడిని దర్శించాలని తాను చాలాకాలంగా కోరుకుంటున్నానని, తీరిక లేని కార్యక్రమాల వద్ద కుదర లేదని చెప్పారు. ఈ సారి బసవేశ్వరుడి తాత్విక చింతన కార్యక్రమానికే హాజరు కావడం ఆనందంగా ఉందని అన్నారు.

బసవేశ్వరుడి జీవితం యావత్ దేశానికే ఆదర్శ ప్రాయమని హరీష్ రావు అన్నారు. ఆయన తాత్విక చింతనలను దేశం మొత్తం చాటాల్సిన అవసరం ఉందని చెప్పారు. సర్వ మానవ సమానత్వానికి బసవేశ్వరుడు కృషి చేశారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి బసవేశ్వరుడి ప్రవచనాలు అత్యంత అవసరమని అన్నారు. మనుషులందరూ ఒక్కటే అనే సమ భావనను శతాబ్దాల కిందటే ఆయన చాటి చెప్పారని చెప్పారు.












Click it and Unblock the Notifications