వైఎస్ నుంచి కిరణ్ రెడ్డి వరకూ అంతే: కాంగ్రెస్ నేతలను ఏకేసిన హరీష్
సంగారెడ్డి: తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెసు నాయకుల వ్యాఖ్యలపై తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల గురించి ఆలోచించి నిర్మాణం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని, రాజశేఖర రెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా పట్టించుకోలేదని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నేతలు రైతుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని హరీష్రావు విమర్శించారు. సంగారెడ్డిలో హరీష్రావు బుధవారం మీడియాతో మాట్లాడారు. 67 స్వాతంత్య్ర పాలనలో అధిక కాలం దేశాన్ని పాలించింది కాంగ్రెస్సే కదా! ఈ కాలంలో రైతులకు ఏం చేశారు? రాష్ట్రంలో పదేళ్ల హయాంలో కాంగ్రెస్ రైతులకు ఏం చేసింది? రైతాంగం, అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని ఆయన అన్నారు.
మెదక్ జిల్లాలో భారీ నీటి పారుదల ప్రాజెక్టులు లేవని, ప్యాకేజీలు ప్రకటించండి అంటే వినిపించుకోలేదనిస జిల్లాకు మొండి చేయి చూపారని ఆయన అన్నారు. చెరువులను, ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటామని, ఇక 2014, జూన్ 2 కంటే ముందు చనిపోయిన 53 మంది రైతు కుటుంబాలను కూడా తమ ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. ఆ కుటుంబాలకు పరిహారం కూడా చెల్లించామని అన్నారు.
రైతు కుటుంబాలను ఓదార్చి, డబ్బులిచ్చి, సహపంక్తి భోజనాలు చేసింది తామేనని, పదేళ్లు పాలించిన కాంగ్రెసు కనీసం పదో వంతైన రైతులపై ప్రేమ చూపించి ఉంటే బాగుండేదని అన్నారు. ఒక్క రైతును కూడా పరామర్శించలేదని అన్నారు. రాహుల్, సోనియా ఒక వేళ రైతులను పరామర్శించి ఉంటే 2004 కంటే ముందు, ఇప్పుడు పరామర్శించి ఉంటారని చెప్పారు.