కొలువులపై కసరత్తు: శాఖల కార్యదర్శులతో హరీశ్ రావు భేటీ..
50 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దానికి సంబంధించి ఆర్థికశాఖ కసరత్తు చేస్తోంది. శనివారం కొన్ని శాఖల కార్యదర్శులతో ఆర్థికశాఖ మంత్రి సమావేశం అయినా సంగతి తెలిసిందే. ఆ సమావేశం ఆదివారం కూడా కొనసాగింది. ఇవాళ మరికొన్ని శాఖల కార్యదర్శులు, అధికారులతో సమావేశం అయ్యారు. ఆయా శాఖలు గతంలో సమర్పించిన ఖాళీల వివరాలను మరోసారి పరిశీలించారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ప్రస్తుతం ఎందరు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. దానిని బట్టి ఖాళీల వివరాలను నమోదు చేస్తారు. ఈ నెల 13వ తేదీన మంగళవారం రోజున మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఆ రోజున ఖాళీల వివరాలను క్యాబినెట్కు అందజేస్తారు.
ఇవాళ, రేపు ఖాళీల వివరాలను స్టడీ చేస్తారు. మంగళవారం మంత్రివర్గ సమావేశంలో నివేదిక అందజేస్తారు. దీంతో ఖాళీలపై స్పష్టత వస్తుంది. ఆ వెంటనే మంత్రివర్గం ఆమోదించి నోటిఫికేషన్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో ఖాళీల భర్తీపై ప్రభుత్వం కసరత్తు చేస్తోండగా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి, షర్మిల తదితర నేతలు విరుచుకుపడుతున్నారు. తాము ప్రస్తావించబట్టే ప్రభుత్వంలో కదలిక వచ్చిందని వారు ఫైర్ అవుతున్నారు.