చీఫ్ బాబు, జగ్గారెడ్డి తోడు: హరీష్ ఘాటు వ్యాఖ్య
మెదక్: వెన్నుపోటుదారుల సంఘానికి చంద్రబాబు నాయుడు అధ్యక్షుడని, అయితే, దానికి ఇప్పుడు బీజేపీ మెదక్ లోకసభ అభ్యర్థి జగ్గారెడ్డి తోడయ్యారని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు ఆదివారం ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో చేయాల్సిన పనులను కేవలం మూడు నెలల్లోనే చేయాలని ప్రతిపక్షాలు మాట్లాడటం సరికాదన్నారు. ఆయన ఆదివారం మెదక్లో విలేకరులతో మాట్లాడారు.
సంక్షేమ పథకాలు చేపట్టాలని ప్రజలు తమకు ఐదేళ్ల గడువు ఇచ్చారన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలలో ఒక్కటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు సొంత పత్రికలలో వార్తలు రాయించుకొని వాటిని జిరాక్స్ ప్రతులతో ప్రజలను వంచించాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్నికల్లో డిపాజిట్ కోసమే విపక్షాల ప్రయత్నాలు అన్నారు.
ఉప ఎన్నికలకు జరగక ముందే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చేతులెత్తేశాయన్నారు. చంద్రబాబు, వెంకయ్య నాయుడు ప్రచారానికి ముఖం చాటేశారన్నారు. బీజేపీ టిక్కెట్టు ఇస్తే కౌన్సిలర్గా, తెరాస టిక్కెట్టుపై ఎమ్మెల్యే, కాంగ్రెస్లో చీఫ్ విప్గా పని చేసిన జగ్గారెడ్డి బీజేపీలో ఎన్ని రోజులు ఉంటారో తెలియదన్నారు. చంద్రబాబుకు ఇప్పుడు జగ్గారెడ్డి తోడయ్యారన్నారు.
తల తాకట్టు పెట్టైనా రుణమాఫీ: కేటీఆర్
తల తాకట్టు పెట్టైనా రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. ఆదివారం చేగుంటలో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ దామోదర్రెడ్డితో పాటు 10 మంది డైరెక్టర్లు, 12 మంది సర్పంచ్లు, 15 మంది పీఏసీఎస్ చైర్మన్లు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో ఈ సందర్భంగా చేరారు.