మందు బాబులకు షాక్ - మద్యం ధరలు భారీగా పెంపు..!!
తెలంగాణలో మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో మద్యం అమ్మకాల ద్వారా అంచనా వేసిన ఆదాయం చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ఇదే అంశం పైన శాసనసభలో చర్చ జరిగింది. బడ్జెట్ ప్రతిపాదనలు చూసిన తరువాత తెలంగాణలో పెద్ద మొత్తంలో బీర్లు, లిక్కర్ ధరలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణకు ప్రభుత్వం ఈ మార్గం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
ధరల పెంపు
ఎక్సైజ్ అంశం పై మాజీ మంత్రి హరీష్ అసెంబ్లీలో స్పందించారు. బీర్లు, లిక్కర్ ధరలు రాబోయే రోజుల్లో భారీగా పెంచబోతున్నట్లు బడ్జెట్ అంచనాలు పరిశీలిస్తే స్పష్టంగా అర్థమవుతుందని హరీశ్రావు పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ నాయకులు తల దించుకోవాలని విమర్శించారు. 2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 19,884 కోట్ల ఆదాయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుకుంటే, 2024-25కు గాను కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25,617 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు.

బడ్జెట్ లెక్కల్లో
దీని ద్వారా రూ. 5,773 కోట్లు అదనంగా అంచనా వేసుకున్నారు. రూ. 2,760 కోట్లుగా ఉన్న బీర్లపై డ్యూటీని రూ. 3,500 కోట్లకు పెంచారు. లిక్కర్పై ఉన్న డ్యూటీని రూ. 11,031 కోట్ల నుంచి రూ. 15,500 కోట్లకు పెంచారు. అంటే బీర్లు, లిక్కర్ ధరలు రాబోయే రోజుల్లో భారీగా పెంచబోతున్నట్లు స్పష్టం చేశారని హరీశ్రావు తెలిపారు. 2023-24లో ఉన్న రూ. 14,570 కోట్ల ఎక్సైజ్ వ్యాట్ను 2024-25కు గాను రూ. 16,432 కోట్లుగా అంచనా వేశారు. అంటే రూ. 2000 కోట్ల వ్యాట్కు సమానమైన మద్యం అమ్మకాలను పెంచబోతున్నట్లు చెప్పారు.

ప్రభుత్వం సిద్దం
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకాలపై రాద్దాంతం చేసిన వాళ్లే, మద్యం అమ్మకం ద్వారా రూ. 7,700 కోట్ల అధిక రాబడిని సమకూర్చుకోవాలని బడ్జెట్ అంచనాలు పొందుపరిచారు. ఎక్సైజ్, వ్యాట్ కలిపి మొత్తం 42 వేల కోట్ల 49 రూపాయలు ఎక్సైజ్ రూపంలో ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్లో పెట్టారు. నాడు గ్రామాల్లో బెల్ట్ షాపు.. ఇప్పుడు గల్లీకో బెల్ట్ షాపు పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసి వసూలు చేస్తామని చెబుతున్నారు. బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి, రూ. 42వేల కోట్ల ఆదాయం తెచ్చుకునే ప్లాన్ చేస్తున్నారని హరీశ్రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications