చంద్రబాబు గురించి మాకంతా తెలుసు, ఎవరి తరంకాదు: హరీష్ రావు
హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం నాడు వరంగల్ జిల్లాలోని కడిపికొండలో మిషన్ కాకతీయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
సాగునీటి ప్రాజెక్టులపై ఏపీ మంత్రులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయలేదా అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి ఆపడం ఎవరి తరమూ కాదన్నారు.
చంద్రబాబు హయాంలోనే కాళేశ్వరం, డిండీ ప్రాజెక్టులపై జీవో రాలేదా అని నిలదీశారు. చంద్రబాబువి బూటకపు మాటలని ధ్వజమెత్తారు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు బాగా తెలుసునని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం మానుకోవాలని సూచించారు.
సిద్ధేశ్వరం చెరువుకు రూ.50లక్షలు మంజూరు చేయనున్నట్టు మంత్రి హరీశ్ రావు తెలిపారు. వరంగల్ జిల్లాలో చెరువుల పునరుద్దరణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. భద్రకాళి చెరువు కట్ట మరమ్మతులకు రూ.5కోట్లు ఇస్తామన్నారు.
ఆకేరు వాగుపై శిథిలమైన చెక్డ్యాంల స్థానంలో కొత్త చెక్ డ్యాంలను నిర్మించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ నరేందర్, ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేశ్, టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడు ఎర్రోళ్ల శ్రీనివాస్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.