డాక్టర్లు ఫుల్ .. పేషెంట్స్ నిల్.. డాక్టర్లకు దణ్ణం పెట్టిమరీ మంత్రి హరీష్ రావు చురకలు
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పేదలకు వైద్యం అందించడంలో ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఈఎస్ఐ ఆస్పత్రిని మంత్రి హరీష్ రావు సందర్శించారు. సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో 20 కోట్లతో ఆధునీకరించిన ఈఎస్ఐ ఆసుపత్రిని మంత్రి మల్లారెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిని ఆయన పరిశీలించారు.

ముగ్గురు డాక్టర్లు కలిసి జూలై నెలలో 3 డెలివరీలు చేశారా? మంత్రి హరీష్ రావు
ఈ క్రమంలో హరీష్ రావు ఈఎస్ఐ ఆసుపత్రిలోని పరిస్థితులపై, వైద్యుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వైద్య పరికరాలు లేవన్న సాకుతో పని చేయకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఈఎస్ఐ ఆస్పత్రిలో డెలివరీలు ఎందుకు చేయడం లేదని డాక్టర్లను మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ముగ్గురు డాక్టర్లు కలిసి జూలై నెలలో 3 డెలివరీలు చేయడంపై మంత్రి సీరియస్ అయ్యారు. డాక్టర్లకు ఇక్కడ పని లేకుంటే పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ చేయాలంటూ మంత్రి హితవు పలికారు.

నాలుగేళ్ళుగా డ్యూటీకి రాని వాళ్ళపై చర్యలేవి? మంత్రి సీరియస్
ఇక ఈఎస్ఐ ఆస్పత్రిలో గత నాలుగు సంవత్సరాలుగా డ్యూటీకి రాని నలుగురు డాక్టర్ల పైన కూడా మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. నలుగురు వైద్యులు డ్యూటీకి రాకుండా, నాలుగు సంవత్సరాలుగా ఉంటే వారిపై ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ ను హరీష్ రావు ప్రశ్నించారు. హాస్పిటల్ లో డాక్టర్లు ఫుల్ గా ఉన్నప్పటికీ పేషెంట్లు నిల్ అంటూ హరీష్ రావు మండిపడ్డారు. ఏదో ఒక వంకతో డాక్టర్లు పని చేయడం లేదంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

డాక్టర్ లకు దణ్ణం పెట్టి మరీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి
ఇక ఆసుపత్రి సూపరింటెండెంట్ నోడల్ ఆఫీసర్ అయినప్పుడు ఎందుకు వైద్య పరికరాలు తీసుకోలేదని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. డాక్టర్లకు దండం పెట్టి మరి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. దయచేసి పని చేయండి.. మీ వృత్తికి న్యాయం చేయండి అంటూ హరీష్ రావు డాక్టర్లను వేడుకున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు లేవని, ఆసుపత్రుల్లో వైద్యులు రోగులను పట్టించుకోవడంలేదని, రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనేక విమర్శలు వెల్లువగా మారాయి. ఈ క్రమంలోనే మంత్రి హరీష్ రావు వైద్యులు విధి నిర్వహణను నిర్లక్ష్యం చేయొద్దంటూ సూచిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్ఐ ఆస్పత్రులను పటిష్టం చేస్తున్నామన్న మంత్రి మల్లారెడ్డి
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఈఎస్ఐ ఆస్పత్రులను పటిష్టం చేసి పేర్కొన్నారు. కార్మిక సంక్షేమం కోసం కేసిఆర్ చొరవతో ఆసుపత్రులపై దృష్టి సారించామని తెలిపారు. అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్న మంత్రి మల్లారెడ్డి రామచంద్రపురం ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆధునికీకరణ పనులు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే పటాన్ చెరులో 30 పడకల ఈఎస్ఐ దవాఖాన నిర్మిస్తామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications