మాతో పెట్టుకుంటే మీకే నష్టం: బాబుకు హరీష్ రావు హెచ్చరిక
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఓర్వలేకపోతుందని, అనవసర వివాదంతో ఆంధ్రాకే నష్టమని తెలంగాణ మంత్రి హరీష్ రావు శుక్రవారం నాడు హెచ్చరించారు. ఏపీలో పార్టీలన్నీ ఏకమయ్యాయని, తెలంగాణలో ఎందుకు ఏకం కావడం లేదని ప్రశ్నించారు.
ప్రాజెక్టుల రీడిజైనింగ్తో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పారు. హరీష్ రావు గురువారం కూడా ఏపీ పైన మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో వివాదం పెట్టుకుంటే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలేనని, చంద్రబాబు ఇది గుర్తు పెట్టుకోవాలన్నారు.
మా నీళ్లు మాకు దక్కడం కోసం కాళేశ్వర ప్రాజెక్టు నిర్మిస్తున్నాం తప్ప, ఏపీలో చుక్క నీటి కోసం కాదన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 293 టీఎంసీలు మిగులు జలాలు, 77 నికర జలాలపై హక్కులున్నాయన్నారు. ఏ ప్రాజెక్టులు నిర్మించినా తెలంగాణకు కేటాయించిన నీటి జలాలలోనే నిర్మిస్తున్నామన్నారు.
ఏపీకి కేటాయించిన చుక్క నీరు వాడుకునే అవసరం తమకు లేదన్నారు. జగన్ దీక్షతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు విషయంలో కోర్టుకు వెళ్లినా తెలంగాణకు న్యాయమైన తీర్పు వస్తుందన్నారు.
ఏపీ మంత్రి దేవినేని ఉమ గురువారం మాట్లాడుతూ... పట్టిసీమ ఎత్తిపోతల నుంచి ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తున్న 80 టీఎంసీల్లో 45 టీఎంసీలు తెలంగాణవేనంటూ ఆ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు సత్యదూరమని అన్నారు.