మార్చిలో సెషన్స్: టిఆర్ఎస్లో 'డిండి' చిచ్చు, రంగంలోకి హరీష్రావు!
హైదరాబాద్: మార్చి రెండో వారంలో తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని, గతంలో శాసనసభ నిర్వహిస్తున్నారంటే విద్యుత్ పైనే చర్చ జరిగేదని, ప్రస్తుతం విద్యుత్ మీద చర్చ లేకుండానే సభ నిర్వహించబోతున్నామని మంత్రి హరీష్ రావు ఆదివారం చెప్పారు.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై సభలో చర్చిస్తామన్నారు. మిషన్ కాకతీయకు ప్రశంసలు వస్తున్నాయన్నారు. మంచినీటిపై సభలో చర్చ జరగని విధంగా సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. దేశంలో ప్రజాదరణ గల ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఇండియా టుడే సర్వేలో తేలిందన్నారు.
మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం అభివృద్ధి తన బాధ్యత అని చెప్పారు. నారాయణఖేడ్ విజయం ప్రజల విజయమన్నారు. ఉప ఎన్నికలో 83 శాతం పోలింగ్ కావడం రికార్డు అన్నారు. సీఎం కేసీఆర్ సుపరిపాలన వల్లే ఖేడ్లో విజయం సాధ్యమైందన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామన్నారు.
ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఖేడ్ను అభివృద్ధి చేస్తామన్నారు. విపక్షాల మాటలను ప్రజలు పట్టించుకోలేదన్నారు. గత ఎమ్మెల్యేల హయాంలో ఖేడ్ అభివృద్ధి చెందలేదని, ఓటమి పాలైన తర్వాత కూడా విపక్షాలకు బుద్ధి రావడం లేదన్నారు. ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పాలమూరు, నల్గొండ టిఆర్ఎస్ నేతల మధ్య డిండి ప్రాజెక్టు చిచ్చు!
నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ భూతం నుంచి విముక్తి కల్పిస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు పక్కా ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా గతంలో ఎప్పుడో ప్రణాళిక రూపొందిన డిండి ఎత్తిపోతల పథకం ప్రతిపాదనలకు బూజు దులిపింది.
శ్రీశైలం ప్రాజెక్టు జలాలను ఆధారం చేసుకుని ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం దాదాపుగా పచ్చజెండా ఊపింది. అయితే, డిండి ఎత్తిపోతల పథకం కెనాల్ రూట్ పైన నల్గొండ జిల్లాకు పొరుగున ఉన్న మహబూబ్ నగర్ జిల్లావాసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిపాదనల్లో ఉన్నట్టుగానే కెనాల్ నిర్మిస్తే తమ జిల్లాకు తీరని అన్యాయం జరగడం ఖాయమని మహబూబూ నగర్ వాసులు వాపోతున్నారు. దీనిపై నల్గొండ జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇరు జిల్లాల నేతల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రబుల్ షూటర్ హరీష్ రావును సీఎం కెసిఆర్ రంగంలోకి దింపినట్లుగా తెలుస్తోంది.
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల నగారా
వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట పురపాలక సంఘానికి ఎన్నికల షెడ్యూలు ఆదివారం విడుదలైంది. రేపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 24 తుది గడువు ఉంటుంది.
ఈ నెల 25న నామినేషన్ల పరిశీలన జరగనుంది. 26న మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉప సంహరణకు గడువు ఉంటుంది. మార్చి 6న ఉదయం 7 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది. మార్చి 9న ఫలితాలు విడుదల అవుతాయి.