ఆందోళన చెందుతున్నారు, ఆదుకోవాలి: ఏపీ మంత్రి దేవినేనికి హరీశ్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు లేఖ రాశారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు లేఖ రాశారు. పులిచింతల రిజర్వాయర్లో క్రస్ట్ లెవల్ వరకు నీటిని ఉంచాలని లేఖలో హరీష్రావు కోరారు. పులిచింతల బ్యాక్ వాటర్ ఆధారంగా నడుస్తున్న 8 లిఫ్టుల పరిధిలో ఆయకట్టు రైతులను ఆదుకోవడానికి క్రస్ట్ లెవల్ వరకు నీటిని ఉంచాలన్నారు.
తెలంగాణలోని 17 గ్రామాలను ముంచి నిర్మించిన పులిచింతల జలాశయం ఫోర్షోర్లో మూడు లిఫ్టులను ఏర్పాటు చేశారు. మేళ్లచెరువు మండలం చింత్రియాల కింద ఉన్న 1,339 ఎకరాలకు ఈ మూడు లిఫ్టుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు.
రేవూరు లిఫ్టు (3,690 ఎకరాలు), బుగ్గమాదారం లిఫ్టు (4,900), చింతలపాలెం లిఫ్టు (4,800 ఎకరాలు)లు నడువాలంటే పులిచింతల రిజర్వాయర్లో కనిష్ఠ నీటి సేకరణ స్థాయి (ఎండీడీఎల్)ఉండాలి. అందుకు జలాశయంలో కనీసం 3.6 టీఎంసీల వరకు నీరు ఉండాలి. అయితే, ఆంధ్రప్రదేశ్ అధికారులు జలాశయం నుంచి నీటిని దిగువకు పూర్తిగా వదిలేయడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
నీరు లేక సుమారు 16వేల ఎకరాల వరకు పత్తి, మిరప పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై మంత్రి హరీశ్రావు ఆదేశానుసారం జనవరి 10వ తేదీన నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్కుఉ లేఖ రాశారు. ఏపీ అధికారులు ఈ లేఖను కృష్ణా బోర్డు దృష్టికి తీసుకుపోవడంతో బోర్డు కూడా ఏపీ సర్కారుకు లేఖ రాసింది.
దీంతో వెంటనే స్పందించిన మంత్రి హరీశ్రావు ఆదివారం ఉదయం చీఫ్ ఇంజినీర్ సునీల్ను అప్రమత్తం చేసి... పులిచింతల సీఈతో మాట్లాడించారు. సోమవారం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్రావు, సీఈ సునీల్ సమావేశమై ఏపీ ప్రభుత్వంతో మాట్లాడాలని ఆదేశించారు. కృష్ణా బోర్డు ఆదేశాలను కూడా అమలు చేయనందున ఏపీ సర్కారుపై బోర్డుకు ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించానని మంత్రి తెలిపారు.