అమీర్పేట భూవివాదం: హైకోర్టులో రోశయ్యకు ఊరట
హైదరాబాద్: హైదరాబాదులోని అమీర్పేట భూముల వివాదంలో తమిళనాడు గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్యకు మంగళవారంనాడు హైకోర్టులో ఊరట లభించింది. అమీర్పేట భూవివాదం కేసులో స్క్వాష్ పిటిషన్ను హైకోర్టు అనుమతి ఇచ్చిది. ఆయనతో పాటు 16 మందిపై ఈ కేసు నమోదు అయింది. దీంతో ఆయనపై ఏ కేసు కూడా లేనట్లే భావించవచ్చు.
తనను ప్రాసిక్యూట్ చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని ఆయన ఆ మధ్య స్క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపి హైకోర్టు స్క్వాష్ పిటిషన్ను అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రోశయ్య హైదరాబాదులోని అమీర్పేటలో గల 9.14 ఎకరాలను భూమిని డీనోటిఫై చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలైంది.

2009-10 మధ్యలో రోశయ్యమీద భూవివాదం కేసు నమోదు అయ్యింది. అయితే ఆ కేసుకు సంబంధించి అప్పట్లో ఏసీబీ క్లీన్ చీట్ ఇచ్చింది. తర్వాత తనపై నమోదు అయిన అభియోగాలను కొట్టివేయాలని కోరుతూ రోశయ్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మంగళవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఏసీబీ నమోదు చేసిన అభియోగాలను కొట్టివేస్తూ రోశయ్యకు ఊరట కలిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
రోశయ్య వ్యక్తిగత హాజరుపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు గతంలో స్టే ఇచ్చింది. రోశయ్య రాజ్యాంగబద్దమైన వ్యక్తి అని, ఆయన గవర్నర్గా ఉన్నంత వరకు ఎలాంటి నోటీసులు జారీ చేయవద్దని ఆదేశించింది. అప్పట్లో అమీర్పేట భూముల కేసులో రోశయ్య ఆగస్టు 2న వ్యక్తిగతంగా కాకుండా తన న్యాయవాది ద్వారా వివరణ ఇచ్చుకోవచ్చునని తెలిపింది. రోశయ్య రాజ్యాంగ బద్దమైన వ్యక్తి కాబట్టి నోటీసులు జారీ చేసే అధికారం కోర్టుకు కూడా లేదని ఈ సందర్భంగా తెలిపింది.
కాగా అమీర్ పేట భూముల కేసులో రోశయ్యకు అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) కోర్టు గతంలో సమన్లు జారీ చేసింది. రోశయ్యను విచారించకుండానే ఎసిబి నివేదికను కోర్టుకు సమర్పించింది. అమీర్పేట భూవ్యవహారంలో ఐఎఎస్ అధికారులు సమర్పించిన పత్రాలను, ఇతర సాక్ష్యాలను జోడిస్తూ తెలంగాణ న్యాయవాదుల సంఘం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్కు, ప్రధాని మన్మోహన్ సింగ్కు గతంలో ఫిర్యాదు చేసింది. రోశయ్యను రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది.
అమీర్పేటలోని మైత్రీవనం వద్ద కోట్లాది రూపాయల భూమిని డీనోటిఫై చేసిన కేసులో రోశయ్య చీటింగ్, అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటున్నారు. 2జి కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది టి. శ్రీరంగారావు - దురుద్దేశ్యాలతో విధులు నిర్వహించిన ప్రభుత్వ సేవకులను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి అవసరం లేదని ఎసిబి కోర్టులో రోశయ్యకు వ్యతిరేకంగా వాదించారు. ఈ కేసులో ఐఎఎస్ అధికారులు బిపి ఆచార్య, టి. సన్యాసి అప్పారావు ఎసిబి కోర్టు ముందు గతంలో సాక్ష్యాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications