ఎన్నారైల కారుతో ఉడాయింపు: ఆరుగురు అమ్మాయిలతో ప్రేమాయణం
హైదరాబాద్ : ఇటీవల రాజమండ్రి పుష్కరాలకు వెళ్లిన ఎన్నారై దంపతుల కారును, నగలను తస్కరించి పారిపోయిన శ్రీనివాస్ రెడ్డి అలియాస్ గౌతంకృష్ణ, అలియాస్ సూర్యతేజ (29) లీలలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగే నేర్పరితనం, ఆకట్టుకునే రూపం, మాటకారితనం అతని లీలలకు పెట్టబడిగా పనికివస్తున్నాయి.
చదివింది పదో తరగతే అయినా పూటకో వేషం వేయడంలో నేర్పు సాధించాడు. గోదావరి పుష్కరాలకు వెళ్లిన ఎన్నారై దంపతులకు తాత్కాలిక డ్రైవర్గా వెళ్లి వారి కారును, నగలను తీసుకుని ఉడాయించాడు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కరాలపాడు గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అతని లీలలు బయపడుతూ వస్తున్నాయి. అతనికి కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తూ ఉండడం పోలీసులను ఆశ్చర్యపరిచింది. రంగారెడ్డి జిల్లా బండ్లగూడకు చెందిన వ్యాపారి కొల్లి గాంధీ అల్లుడు నారాయణ రెడ్డి తన భార్య, కూతుళ్లతో కలిసి గత నెల 17వ తేదీన పుష్కరాల స్నానం కోసం లండన్ నుంచి హైదరాబాద్.
మర్నాడు తమ స్విఫ్ట్ డిజైర్ కారుకు తాత్కాలిక డ్రైవర్గా జూబ్లీహిల్స్లోని గాయత్రీహిల్స్కు చెందిన శ్రీనివాస్ రెడ్డి అలియాస్ గౌతంకృష్ణను నియమించుకుని రాజమండ్రి వెళ్లారు. నారాయణ రెడ్డి తన కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం చేసి వచ్చేలోగా శ్రీనివాస్ రెడ్డి వారి నగలు, సెల్ఫోన్లు, కారుతో సహా ఉడాయించాడు.
బాధితుల ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగలను నిందితుడు బ్యాంకులో తనఖా పెట్టినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అయితే అతను గుండెలు తీసిన బంటు అని పోలీసుల దర్యాప్తులో తేలింది.
ఆరుగురు యువతులతో అతను ప్రేమాయణం నడుపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో అతను పరిచయం చేసుకున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో కథ వినిపించాడు. అమెరికాలో, సింగపూర్లోఉంటున్నట్లు చెప్పి ప్రేమాయణం సాగించాడు.
నేరం చేసిన తర్వాత చిక్కకుండా దాదాపు 40 సిమ్ కార్డులను మార్చినట్లు పోలీసులు గుర్తించారు. తాను దొంగిలించిన నగలను కుటుంబ సభ్యుల ద్వారానే నగరానికి తరలించినట్లు తెలుసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డిని పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.