రాజీ'డ్రామా' ప్లాన్ వెనుక!: కెసిఆర్కు తలసాని తలనొప్పి, దూకుడు అందుకే?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా అంశం కొత్త తలనొప్పులు తీసుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను ఆర్టీఐ ద్వారా తలసాని రాజీనామాపై వివరాలు కోరగా, అందలేదని అసెంబ్లీ అధికారులు చెప్పారని గండ్ర వెంకట రమణా రెడ్డి చెప్పారు.
ఇది కొత్త వివాదానికి దారి తీసింది. ఇప్పటి వరకు... రాజీనామా అందించానని, స్పీకర్ ఆమోదించాల్సి ఉందని తలసాని వర్గం చెబుతోంది. కానీ, అసలు రాజీనామా చేయలేదని వెల్లడి కావడం గమనార్హం. దీనిపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంటోంది.
తలసాని శ్రీనివాస్ యాదవ్ గత సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఆయన కారు ఎక్కి, మంత్రి అయ్యారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలని టిడిపి ఇప్పటికే ఫిర్యాదు చేసింది.

అయితే, తలసాని రాజీనామా లేదా రాజీనామా ఆమోదం పైన టిడిపి కంటే కాంగ్రెస్ పార్టీ ఒకింత ఎక్కువ దూకుడు ప్రదర్శిస్తోంది. దానికి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. తలసాని రాజీనామా చేస్తే, దానిని ఆమోదిస్తే వచ్చే ఉప ఎన్నికల్లో తాను గెలవననే రాజీనామా పైన తలసాని డ్రామాలు ఆడారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తలసానిది అంతకుముందు సికింద్రాబాద్ నియోజవకవర్గం. ఎన్నికలకు ముందు సనత్ నగర్ నియోజకవర్గానికి మారారు. అయితే, ఆయన చేతిలో ఓడిన మర్రి శశిధర్ రెడ్డి మాత్రం సనత్ నగర్ నుండి ఎప్పటి నుండో ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
గత ఎన్నికలకు ముందు మర్రి సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు అక్కడ మంచి పట్టు ఉంది. తలసాని ఈ నియోజకవర్గానికి రావడం, పైగా టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో అక్కడ ఓ వర్గం చీలిపోతుందనే భావన ఉంది.
దీంతో, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగే మర్రి శశిధర్ రెడ్డి గట్టెక్కవచ్చుననే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో ఉందని అంటున్నారు. అందుకోసమే ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ తహతహలాడుతోందని అంటున్నారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే, రాజీనామా నిర్ణయం సభాపతి చేతిలో ఉందని చెప్పడం సీఎం కెసిఆర్, గవర్నర్ నరసింహన్, సభాపతి మధుసుధనా చారిలను తప్పుదోవ పట్టించారని, ఆయన పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదా ప్లాన్ వెనుక కెసిఆర్ ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications