ఇక ఆరోగ్య తెలంగాణ..!అందరికి ఉచిత వైద్యం దిశగా కేసీఆర్ ప్రభుత్వం అడుగులు..!!
Recommended Video
హైదరాబాద్ : గతంలో కంటి వెలుగు పథకం ద్వారా ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయింది, ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందించిన తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. తెలంగాణలో అనేక వ్యాధులతో బాధపడుతున్న అందరికి ఉచిత వైద్యం అందించే దిశగా ఓ బృహత్కర కార్యక్రమానికి ప్రణాళికలు రచిస్తోంది. ఈ పథకం నేరుగా ప్రజల్లోకి వెళ్లగలిగితే ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు ఆలోచన ఉన్నతంగా ఉన్నప్పటికి ఆర్థిక వనరుల సర్దుబాటే గుదిబండగా మారనుంది. ఆర్థిక సమస్యలను అదిగమించి అదికారులు పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే మంచి ఫలితాలు రావడం ఖయమనే చర్చ తెలంగాణ ప్రజానికంలో జరుగుతోంది.
సార్వజనీన ఆరోగ్య పథకం అమలుకు ప్రభుత్వం యోచన..! ఇప్పటికే ఎన్నో ఆరోగ్య పథకాల అమలు..!!
రాష్ట్రంలో కొత్తగా సార్వజనీన ఆరోగ్య సంరక్షణ పథకాన్ని(యూనివర్సల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్) అమల్లోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటికే వేర్వేరు ఆరోగ్య పథకాల కింద దాదాపు కోటి కుటుంబాలకు వైద్య సేవలు లభ్యమవుతున్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుకు కిందకు తీసుకొచ్చి ఏకగవాక్ష విధానంలో అమలు చేయడంపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. తద్వారా నిధులు సద్వినియోగమవడంతోపాటు ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యసేవలందించడానికి మార్గం సులభమవుతుందని భావిస్తోంది.
అనేక రూపాల్లో నిధుల వ్యయం..! కట్టడి చేసుందుకే ఉచిత వైద్యం..!!
రాష్ట్రంలో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, ఆరోగ్య భద్రత, ఆర్టీసీ, సింగరేణి, ఈఎస్ఐల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా వైద్యసేవలకయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తోంది. అదనంగా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల కోసం ఏటా పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోంది. మొత్తంగా అన్నింటికీ కలిపి ఏటా దాదాపు 2 వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వ నిధులు ఖర్చవుతున్నట్లు అంచనా. అయినా వైద్య సేవల్లో లోటుపాట్లు ఎదురవుతూనే ఉన్నాయి. ఆరోగ్యశ్రీ మినహా మిగిలిన ఏ పథకం అమల్లోనూ ఆన్లైన్ సమాచారం పొందుపర్చడం లేదు. ఆయా జిల్లాల్లో ఎటువంటి వ్యాధులు ప్రబలుతున్నాయి? వారికి అందుతున్న వైద్య సేవలు ఏమిటి? అనే సమాచారమేదీ అందుబాటులో ఉండటం లేదు. ఈ దృష్ట్యా వైద్యారోగ్యశాఖ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసినట్లు తెలిసింది.
వందశాతం ప్రజలకు ఉచిత వైద్యం..! దాదాపు కోటి కుటుంబాలకు వైద్య సేవలు..!!
'ఏ పథకం కింద ఎన్ని కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి? వాటికి ఏటా అయ్యే ఖర్చు ఎంత? వాటన్నింటినీ ఒకే గూటికి తేవడం ద్వారా ఏవిధంగా మెరుగైన వైద్యసేవలు అందించవచ్చు?' తదితర అంశాలతో కూడిన సమాచారాన్ని ప్రతిపాదనల్లో పొందుపర్చినట్టు సమాచారం. ఇదే విషయంపై ఇటీవల వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉన్నతాధికారులతో చర్చించారు. 'వేర్వేరు పథకాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా వంద శాతం ప్రజలకు ఉచిత వైద్యం అందించవచ్చని, వైద్య సేవల సంఖ్య పెంచడంతోపాటు నిధులనూ పారదర్శకంగా వినియోగించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది.
అన్నింటినీ ఒకే గూటి కిందకు తీసుకొచ్చే యత్నం..! ఏటా 2 వేల కోట్లు ఖర్చు..!!
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నాం' అని వైద్య వర్గాలు తెలిపాయి. ఆయుష్మాన్ భారత్లో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలపైనా ఈ సందర్భంగా చర్చించినట్టు తెలిసింది. ఆ పథకం నిబంధనల ప్రకారం రాష్ట్రంలో సుమారు 20 లక్షల కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరే అవకాశాలున్నాయని, ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద 77 లక్షల కుటుంబాలకు వైద్యసేవలందిస్తున్నామని ఉన్నతాధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 'ఆయుష్మాన్ భారత్లో చేరడం వల్ల రాష్ట్రంలోని 20 లక్షల కుటుంబాల మేరకైనా నిధులు వచ్చే అవకాశాలున్నాయనే అంశం కూడా చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాక ఈ అంశంపై ముందుకెళ్లాలని నిర్ణయానికొచ్చాం' అని వైద్య వర్గాలు వెల్లడించాయి.