ఓటుకు నోటు, చంద్రబాబు పాత్ర: 'ఏసీబీ కోర్టు వాటిని పరిగణలోకి తీసుకోలేదు'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మళ్లీ విచారణ ప్రారంభమైంది. సుప్రీం కోర్టు ఆదేసాల మేరకు హైకోర్టు ఈ కేసు విచారణను ప్రారంభించింది. గత ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు ప్రకంపంలు సృష్టించిన విషయం తెలిసిందే.
దీనిపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈ కేసులో తన ప్రమేయంపై విచారణ జరిపించాలంటూ ఏసీబీ న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం వాదనలు విన్నది.
చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఏసీబీ కోర్టు పలు అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఉత్తర్వులు జారీ చేసిందని హైకోర్టుకు తెలిపారు. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా పడింది.
ఓటుకు నోటు పైన వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీం కోర్టు గడప తొక్కారు. ఆధారాలను ఆయన సేకరించినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు పాత్రపై విచారణకు ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని చంద్రబాబు హైకోర్టులో సవాల్ చేశారు.