హైదరాబాద్లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్ జామ్
హైదరాబాద్: నగరంలో గత రెండు రోజులుగా కొంత ఎడతెరిపినిచ్చిన వాన.. మళ్లీ గురువారం దంచికొట్టింది. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. గురువారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసంది. దీంతో లోట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదనీరు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది.
ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, పంజాగుట్ట, అమీర్పేట్, బంజారాహిల్స్, జూబ్లీ హీల్స్, మాదాపూర్ ఫిలింనగర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మణికొండ, శేరిలింగం పల్లి, పటాన్ చెరు, మెహిదీపట్నం కొండాపూర్, కేపీహెచ్ బీ, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిస్తోంది. భారీ వర్షానికి నగరంలో ఉన్న నాలాలు, చెరువులు పొంగి పొర్లాయి. రోడ్లన్నీ జలయయం అయ్యాయి. దీంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ కురుస్తోంది. అకాల వర్షంతో రాష్ట్రం వ్యాప్తంగా భారీ పంట నష్టం జరిగింది. చేతికొచ్చి ధాన్యం కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న సమయంలో వాన కురవడంతో ధాన్యం తడిసిముద్దైంది. అటు కోతకు సిద్ధంగా ఉన్న పంటతో పాటు కొనుగోలుకు తరలించిన ధాన్యం వర్షంలో తడవడంతో రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మొక్కొజన్న, మామిడి, మిర్చి, ఇతర పంటలు కూడా వర్షాలకు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, పంట నష్టం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇది ఇలావుండగా, 'మోచా' తుఫాను రూపంలో మరో ముప్పు పొంచివుంది. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పిన వాతావరణ శాఖ.. మరో 3 రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవ కాశం ఉందని హెచ్చరించింది. 6వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతుందని.. అది బలపడి 7న అల్పపీడనంగా మారుతుందన్నారు. 8న మరింత బలపడి తీవ్ర అల్ప పీడనంగా మారుతుందని.. మరుసటి రోజు అది తీవ్రమై తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.












Click it and Unblock the Notifications