తెలంగాణాకు తీవ్ర హెచ్చరిక; శ్రీశైలం, నాగార్జున సాగర్ లకు పోటెత్తిన వరద!!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. గత పది రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పట్టిన ముసురు వాతావరణం ఇంకా వీడటం లేదు. రాష్ట్రంలో అనేక జిల్లాలలో వర్షాలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో నేడు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తెలంగాణాలో నేడు కూడా వర్షాలు
తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికల ప్రకారం నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ తో పాటు నేడు కొన్ని జిల్లాలలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.మరోవైపు రుతుపవనాల ప్రభావంతో నేడు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి.

నేడు వర్షాలు ఈ జిల్లాలలోనే
ముఖ్యంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల, మహబూబ్నగర్, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలలో నేడు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. ఇక ఇదే సమయంలో దక్షిణ తెలంగాణ జిల్లాలైన నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నారాయణపేట్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో మోస్తరువర్షాలు కురుస్తాయి.
మళ్ళీ పెరుగుతున్న గోదావరి ఉధృతి
ఇప్పటికే గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, జలాశయాలు నిండుకుండలుగా మారి జలకళను సంతరించుకున్నాయి. ప్రాజెక్టులకు కూడా భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టులు కూడా నిండుకుండలుగా మారాయి. నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన గోదావరి ప్రవాహం మళ్లీ పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 43.30 అడుగులకు పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
సాగర్ కు పెరుగుతున్న వరద
ఇదిలా ఉంటే ఎగువ నుంచి భారీగా వరదనీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు ప్రాజెక్టు 3క్రస్టు గేట్లు 10ఫీట్ల మేర ఎత్తడం ద్వారా లక్షా 43వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. దీంతో ప్రస్తుతం సాగర్ 516.30అడుగులకు చేరింది.
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
సాగర్ కుడి కాలువ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు 5400 క్యూసెక్కుల, SLBC ద్వారా హైదారాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం మరో 450క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు... శ్రీశైలం జలాశయానికి జూరాల సుంకేసుల జలాశయాల ద్వారా 4లక్షల 42వేల 261 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది.. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల సాగు, తాగు, నీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని అధికారులు చెప్తున్నారు..












Click it and Unblock the Notifications