చుక్కలు కనిపించాయి: వర్షం ధాటికి రోడ్లపై నరకయాతన, మరో నాలుగు రోజులు!
వర్షాలు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
హైదరాబాద్: కాస్త తెరిపినిచ్చి.. నగరం తేరుకుంటుందనే లోపే వాన మళ్లీ విజృంభిస్తోంది. వరుసగా కురుస్తున్న వర్షాలకు నగరవ్యాప్తంగా ఉన్న రోడ్లన్ని అస్తవ్యస్తంగా మారిపోతున్న పరిస్థితి. గుంతలు పడ్డ రోడ్ల మీద వాహనాదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
పైగా చాలాచోట్ల రోడ్లన్ని జలమయం కావడంతో.. ఎక్కడ మాన్ హోల్స్, నాలాలు ఉన్నాయో తెలియని పరిస్థితి. లోతట్టు ప్రాంతాల జనం ఇళ్లలో చేరిన నీటిని ఎత్తిపోస్తూ నానా అవస్థలు పడ్డారు. సోమవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం మరోసారి భీభత్సాన్నే సృష్టించింది.
ఏకధాటిగా:
సాయంత్రం నుంచి చిన్న చిన్న చినుకులుగా మొదలైన వర్షం.. క్రమంగా కుంభవృష్టిని తలపించింది. ఒకానొక సమయంలో ఒకటి నుంచి రెండు గంటల పాటు ఏకధాటిగా విజృంభించింది. దీంతో నాలాలు, డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. డ్రైనేజీ నీళ్లు రోడ్ల పైకి రావడంతో జనం ఆ దుర్గంధాన్ని భరించలేకపోతున్నారు.
గంట వ్యవధిలోనే 6 సెం.మీ వర్షం:
సోమవారం రాత్రి సమయంలో కేవలం గంట వ్యవధిలోనే 6సె.మీ వర్షం కురవడం గమనార్హం. దీంతో రోడ్లు, పలు కాలనీలు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునగగా.. చాలా చోట్ల మోకాలి లోతు నీళ్లు చేరాయి.
లింగంపల్లి, బీహెచ్ఈఎల్, పటాన్చెరు, రామచంద్రాపురం, నిజాంపేట, దిల్సుఖ్నగర్, కొత్తపేట, సరూర్నగర్, ఉప్పల్, ఎల్బీనగర్, బోయిన్పల్లి, బంజారాహిల్స్, పంజాగుట్ట, సికింద్రాబాద్, సోమాజీగూడ, ఖైరతాబాద్, బేగంపేట, సికింద్రాబాద్, రాజేంద్రగనర్, తదితర ప్రాంతాల్లో వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు.
వాహనదారులకు చుక్కలు:
రామచంద్రాపురంలో 8.3 సెంటీమీటర్లు, మాదాపూర్లో 6.1 సెం.మీల వర్షపాతం నమోదైంది. వర్షానికి రోడ్లపై ట్రాఫిక్ కి.మీ మేర నిలిచిపోయింది. 8గం. రోడ్డెక్కిన వాహనదారులు అర్థరాత్రి అయినా గమ్య స్థానాలకు చేరుకోలేదంటే ట్రాఫిక్ సమస్య ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో వర్షం పడ్డ ప్రతీసారి వాహనదారులకు ఈ తిప్పలు తప్పేలా లేవు. దీంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు.
చేతులెత్తిన పోలీసులు,
హైటెక్సిటీ సైబర్ జంక్షన్లో సిగ్నల్ పని చేయకపోవడంతో కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. మియాపూర్ బొల్లారం మార్గంలో రెండు అడుగుల మేర నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. శిల్పారామం, హఫిజ్పేట ఫ్లై ఓవర్, లింగంపల్లి, రైల్వే బ్రిడ్జి తదితర ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. వర్షపు నీరు రోడ్ల మీద నుంచి పోతే తప్ప ట్రాఫిక్ కంట్రోల్ చేయలేమని పోలీసులు చెప్పడంతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి
నలుగురి దుర్మరణం:
వర్ష ప్రభావంతో నలుగురు దుర్మరణం చెందినట్లుగా తెలుస్తోంది. పాతబస్తీలో నాలాలో పడి వృద్ధుడు, గుంతలో పడి మరో బాలుడు మరణించాడు. ఆదివారం మధ్యాహ్నం చాంద్రాయణగుట్టలోని ఆల్జుబెల్ కాలనీ నాలాలో పడిన ఆటో డ్రైవర్ వాజిద్ఖాన్ (60) సోమవారం శవమై తేలాడు. దే కాలనీలో నివసించే ఆల్తాఫ్ (9) ఆడుకుంటూ వెళ్లి రైల్వే ట్రాక్ పక్కన తీసిన గుంతలో పడి దుర్మరణం చెందాడు.
మరో నాలుగు రోజులు:
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఎలాంటి ముప్పు ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. షాబాద్లో 13.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అమన్గల్లో 10.6, చేవెళ్లలో 10 సెంటీమీటర్ల వర్షం కురిసింది.