మా ఇంట్లో లేదు, ఎంత ఖర్చవుతుంది, ఎవరిని అడగాలి: జడ్జి ఆసక్తికరం
హైదరాబాద్: ఇంకుడు గుంతలకు సంబంధించి న్యాయస్థానంలో దాఖలైన ఓ వ్యాజ్యం పైన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ మంగళవారం నాడు ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇంట్లో కూడా ఇంకుడు గుంత లేదని, ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకున్నాకే ఈ వ్యాజ్యం విచారిస్తానని చెప్పారు.
అంతేకాదు, తనది ఓ చిన్న ఇల్లు అని, అలాగే ఇంకుడు గుంత ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలియదని, ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలో చెప్పాలంటూ పిటిషనర్, జీహెహెచ్ఎంసీ తరపు న్యాయవాదులను కోరారు. జిహెచ్ఎంసి లాయర్ ఇందుకు సంబంధించిన వివరాలు చెబుతానని తెలిపారు.
కాగా, నివాస గృహాల్లో శాశ్వత ప్రాతిపదికన ఇంకుడుగంతల ఏర్పాటు, నీటి పరిరక్షణ కార్యాచరణ ప్రణాళికపై మంగళవారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు. అనంతరం విచారణను వాయిదా వేశారు.
ఇంకుడు గుంతల ఏర్పాటు అమలు కోసం నియమించిన నిపుణుల కమిటీ ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమిటి, భవిష్యత్తులో చేపట్టదలిచిన కార్యాచరణ ప్రణాళిక ఏమిటి, తదితరాలను సమర్పించాలని జిహెచ్ఎంసిని హైకోర్టు ఆదేశించింది.
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ శంకర నారాయణతో కూడిన ధఱ్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వ్యాజ్యంపై తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.