ఓటుకు నోటు: సండ్రకు హైకోర్టులో ఊరట, మోడీవి నీచ రాజకీయాలన్న వీహెచ్
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ షరతులను సోమవారం హైకోర్టు సడలించింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైకోర్టు బెయిల్ నిబంధనలను సడలించింది.
ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య బెయిల్పై ప్రస్తుతం తన నియోజక వర్గమైన సత్తుపల్లిలోనే ఉంటున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్కు వచ్చేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది.
అయితే అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు హైదరాబాద్ మినహా ఎక్కడికైనా వెళ్లొచ్చని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ నేతలు
ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేతలు దగ్ధం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ స్టాంపులు తొలగించి ఎన్డీఏ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు.
సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రధామోడీ తన తీరును మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. కేంద్రం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తోందని వీహెచ్ ఆరోపించారు. రైతు ఆత్మహత్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆత్మహత్యలను రాజకీయం చేయొద్దు: ఎంపీ బూర
రైతు ఆత్మహత్యలను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివరించారు.
సోమవారం భువనగిరిలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు చెక్కుల రూపంలో పరిహారం అందజేశారు. రైతులు అధైర్య పడొద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొంగిడి సునీతతోపాటు పలువురు టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ప్రజలు హాజరయ్యారు.