ట్విస్ట్: హైకోర్టులో బయటపడిన మోసం, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి అనుచరుడిపై కేసు
విలువైన భూములను కాజేసేందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆయన అనుచరుడు బి.శైలేష్ సక్సేనాల బండారం హైకోర్టు సాక్షిగా బట్టబయలైంది.
హైదరాబాద్: విలువైన భూములను కాజేసేందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆయన అనుచరుడు బి.శైలేష్ సక్సేనాల బండారం హైకోర్టు సాక్షిగా బట్టబయలైంది. లేని వ్యక్తుల పేర్లను తెరమీదికి తెచ్చి వారి పేర్లతో తప్పుడు పిటిషన్లను వేసి నడిపించిన కుట్ర బయటపడింది.
హైద్రాబాద్ లోని పలు విలువైన భూములను లేని వ్యక్తుల పేర్లను సృష్టించి కొల్లగొట్టారనే ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని హైద్రాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన నేపథ్యంలో దీపక్ రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ టిడిపి నిర్ణయం తీసుకొంది. అయితే దీపక్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేయడం ఆలస్యమైంది.
అయితే లేని వ్యక్తులను సృష్టించి విలువైన భూములను దక్కించుకోవడం దీపక్ రెడ్డి ఆయన అనుచరులకు వెన్నతో పెట్టిన విద్య అని పోలీసులు చెబుతున్నారు.అయితే ఈ విషయాలపై పోలీసులు మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు.
హైకోర్టును మోసగించే కుట్ర
లేని వ్యక్తుల పేర్లను తెరమీదికి తెచ్చి వారి పేర్లతో తప్పుడు పిటిషన్లను వేశారు దీపక్ రెడ్డి, ఆయన అనుచరుడు సక్సేనా.అయితే ఈ విషయమై అనుమానం వచ్చిన కోర్టు భూముల హక్కుదారులుగా ఉన్న పిటిషన్లు వేసిన వారిని స్వయంగా కోర్టు ముందుకు హజరుకావాలని ఆదేశించింది. అయితే వారెవరూ కూడ హైకోర్టు ముందు హజరుకాలేదు. వారెవరూ కూడ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఇదంతా మోసమని గ్రహించి లేని వ్యక్తుల పేర్తతో దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. తప్పుడు పిటిషన్లను దాఖలు చేసిన సక్సేనాపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్ ను వెంకటేశ్వర్ రెడ్డిని ఆాదేశించింది.
ఫైళ్ళు మాయంపై విచారణ
అయితే ఈ కేసులకు సంబంధించిన ఫైళ్ళు మాయమైన ఘటనపై కూడ విచారణ జరపాలని హైకోర్టు విచారణకు ఆదేశించింది. ఈ విషయంలో హైకోర్టు సిబ్బంది ప్రమేయంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు మంగళవారం తీర్పు ఇచ్చారు.దీపక్ రెడ్డి, శైలేష్ సక్సేనాల భూ భాగోతాలపై మీడియాలో వార్తలు వచ్చాయి. అసలు పిటిషన్లు దాఖలు చేసిన ఇక్బాల్, షకీల్ తో పాటు ఇతర వ్యక్తలు లేరని వారంతా దీపక్ రెడ్డి, శైలేష్ సక్సేనాల సృష్టేనని అయోధ్యనగర్ సోసైటీ ప్రతినిధులు కోర్టుకు నివేదించారు. ఆయా పిటిషనర్లు ఆధార్ కార్డులతో సహా కోర్టు ముందు హజరయ్యేలా ఆదేశాలను ఇవ్వాలని కోరారు.దీంతో కోర్టు ఆదేశాలను జారీ చేసింది.
పిటిషనర్లే లేరు
దీంతో హైకోర్టు పిటిషనర్లు స్వయంగా కోర్టుకు హజరుకావాలని ఆదేశించింది.అయితే కోర్టుకు ఎవరూ కూడ హజరుకాలేదు. అయితే వారికి నోటీసులు పంపాలని కోర్టు రిజిస్ట్రార్ కు సూచించింది. హైకోర్టు ఉద్యోగులకు పిటిషనర్లు ఇచ్చిన చిరునామాలు నకిలీవని తేలింది.దీంతో షకీల్, ఇక్బాల్ తదితర పేర్లతో దాఖలు చేసిన వ్యాజ్యాలను కొట్టివేసింది. తప్పుడు పేర్లతో పిటిషన్లు దాఖలు చేసిన శైలేష్ సక్సేనాపై పోలీసులకు ఫిర్యాదుచేయాలని రిజిస్ట్రార్ ను ఆదేశించింది.
వారసులుగా ఇలా
హైద్రాబాద్ లోని గుడిమల్కాపూర్, భోజగుట్ట ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని అయోధ్యనగర్, మ్యూచ్ వల్ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సోసైటీ లిమిటెడ్ కు కేటాయిస్తూ 2008 లో 455 జివో జారీచేసింది ప్రభుత్వం. అయితే ఆ భూమిపై కన్నేసిన దీపక్ రెడ్డి, సక్సేనాలు ఆ భూమిని కాజేసేందుకు కుట్ర పన్నారు. ఆ భూమి అసలు యజమాని జస్టిస్ సర్ధార్ అలీఖాన్ వారసులంటూ ఇక్బాల్ ఇస్లాంఖాన్, నజీముద్దీన్ ఇస్లాంఖాన్, హబీద్ ఇస్లాంఖాన్, ఇఫ్తేకర్ ఇస్లాంఖాన్, షకీల్, ఇస్లాంఖాన్ పేర్లతో కొందరిని తెరపైకి తెచ్చారు.శివభూషణం అనే వ్యక్తిని ఇక్బాల్ ఇస్లాం ఖాన్ గా నటించేందుకు ఒప్పించి, భోజగుట్ట భూమికి సంబంధించిన భూ ఆక్రమణల నిరోధక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.