స్నేక్ గ్యాంగ్ కేసు: ప్రధాన నిందితుడికి హైకోర్టులో చుక్కెదురు
హైదరాబాద్: స్నేక్గ్యాంగ్ కేసులో ప్రధాన నిందితుడు ఫైజల్ దయానీకి హైకోర్టులో బుధవారం ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన దయానీ, మరికొందరు యువకులు ఓ యువతిని చెరపట్టి పాములతో భయబ్రాంతులకు గురిచేసి, అత్యాచారం చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు.
నిందితులను పోలీసులు నిరుడు ఆగస్టులో అదుపులోకి తీసుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు వీరికి జుడీషియల్ రిమాండ్ విధించింది. వీరిలో కొందరు దాఖలుచేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు గతంలో తోసిపుచ్చింది. తర్వాత స్నేక్గ్యాంగ్లో కీలక నిందితుడిగా ఉన్న ఫైజల్ దయానీ బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్ను అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు.
నిందితుడికి నేరచరిత్ర ఉందని, బెయిలిస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని, స్నేక్గ్యాంగ్ పేరుతో అరాచకాలు సృష్టించారని, బెయిల్ మంజూరు చేస్తే విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, నిందితులపై పీడీ యాక్టుతోసహా పలు కేసులు పెండింగ్లో ఉన్నాయని రామిరెడ్డి అన్నారు.
సహనిందుతుల బెయిల్ పిటషన్ను హైకోర్టు గతంలో తిరస్కరించిందని, ఫైజల్ దయానీకి బెయిల్ మంజూరు చేస్తే తిరిగి అటువంటి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.కే. జైస్వాల్ నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు.