నిలిపివేత: అమరావతి ‘భూదందా’ కథనాలపై జగన్ 'సాక్షి' డైరెక్టర్లకు ఊరట
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అధికార పార్టీకి చెందిన టీడీపీ నేతలు పెద్ద ఎత్తున భూదందాకు పాల్పడ్డారంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్కు చెందిన 'సాక్షి' దినపత్రిక అమరావతి భూదందా పేరిట కథనాలను ప్రచురించిన సంగతి తెలిసిందే.
ఈ కథనాలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద కలకలాన్నే రేపాయి. సాక్షి పత్రిక రాసిన కథనాల్లో నిజం లేదని టీడీపీకి చెందిన కొందరు మంత్రలు అంటే, మరికొందరు మాత్రం తాము రాజధాని ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశామని మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు.

ఈ క్రమంలో సాక్షి పత్రిక రాసిన కథనాలతో తమ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ టీడీపీ నేత, గుంటూరు జిల్లా పొన్నూరు శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పిటిషన్లో సాక్షి పత్రికతో పాటు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన హైకోర్టును అభ్యర్థించారు.
ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీవీ సంజ్ కుమార్ మంగళవారం ఓ కీలక తీర్పును వెలువరించారు. సాక్షి పత్రిక డైరెక్టర్లపై ఈ వ్యవహారానికి సంబంధించిన తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అమరావతి భూదందా కథనాలను ప్రచురించినందుకు గాను సాక్షి డైరెక్టర్లు ఈశ్వరప్రసాద్ రెడ్డి, రాజప్రసాదరెడ్డి, వెంకటకృష్ణ ప్రసాద్, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి, ఎడిటర్ మురళిలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మంగళవారం విచారణలో భాగంగా సాక్షి పత్రిక తరఫు న్యాయవాది వినిపించిన వాదనలతో జడ్జి ఏకీభవించారు.
దీంతో సాక్షి పత్రిక డైరెక్టర్లపై తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications