హై ఎండ్ కార్ల దొంగ: 10రాష్ట్రాల్లో 61చోరీలు; పోలీసులకే సవాల్.. చివరకు జరిగిందిదే!!
హై ఎండ్ కార్లను టార్గెట్ చేసుకొని 2003 నుండి చోరీలకు పాల్పడుతున్న బాగా చదువుకున్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. కార్ల చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన మాజీ ఆర్మీ జవాన్ కుమారుడైన సత్యేంద్ర సింగ్ షెకావత్ ను ఎట్టకేలకు బంజారాహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఫైనాన్స్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేసి కార్ల చోరీ మొదలుపెట్టిన సదరు దొంగ ఇప్పటి వరకూ 10 రాష్ట్రాలలో 61 నేరాలు చేసినట్టు సమాచారం. ఇతని పై సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలలో ఐదు కేసులు నమోదయ్యాయి.
హై ఎండ్ కార్ల చోరీకి పాల్పడుతున్న సత్యేంద్ర సింగ్ షెకావత్
మహారాష్ట్ర నాసిక్ పంచవటి పోలీస్ స్టేషన్ పరిధిలో 2003లో క్వాలిస్ చోరీ చేయడంతో మొదలైన సత్యేంద్ర సింగ్ నేరచరిత్ర ప్రస్తుతం ఆడి, బీఎండబ్ల్యూ, స్కార్పియో వంటి అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే చోరీ చేసేదాకా మారింది. చోరీ చేసిన కార్లను విక్రయించి జల్సాలు చేస్తాడు.
కేవలం అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే టార్గెట్ చేసుకొని సత్యేంద్ర సింగ్ షెకావత్ వాటిని చోరీ చేయటంలో తన ప్రత్యేకతను కనబరుస్తాడు. కారు తాళాలు స్కాన్ చేయడానికి, వాహనం నెంబరు ఇతర వివరాల ఆధారంగా జీపీఎస్ ద్వారా దాని ఉనికిని కనిపెడతాడు. ఇక డూప్లికేట్ కీ తయారు చేసుకోవడానికి అవసరమైన ఉపకరణాలను చైనా నుండి దిగుమతి చేసుకున్నాడు.
లేటెస్ట్ వాహనం ఏదైనా సరే నిముషాల్లో చోరీ చేసే టెక్నాలజీ
ఒక ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ ఆధారంగా కారు తాళం తయారు చేయడంలో ఇతనికి ప్రత్యేకమైన నైపుణ్యం ఉంది. లేటెస్ట్ గా వస్తున్న సెన్సార్ వాహనాలను కూడా సత్యేంద్ర సింగ్ షెకావత్ చాకచక్యంగా చోరీ చేస్తున్నాడు. వీటిని చోరీ చేయడం కోసం చైనా నుంచి ఖరీదు చేసిన ఎక్స్ టూల్ ఎక్స్ 100 ప్యాడ్ అనే పరికరాన్ని ఉపయోగించి చోరీలకు పాల్పడుతున్నాడు.
2003 నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంతోపాటు గా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ , డయ్యూ డామన్ లలో 58 వాహనాలను చోరీ చేశాడు.
చోరీలలో భార్య పాత్ర ఉండటంతో భార్య అరెస్ట్ .. పోలీసులకు దొంగ సవాల్
ఇక ఈ కేసు లతో పాటుగా రెండు దోపిడి, ఒక ఆయుధ చట్టం కేసులు సత్యేంద్ర సింగ్ షెకావత్ పై ఉన్నాయి. సత్యేంద్ర సింగ్ షెకావత్ చోరీల లో ఆయన భార్యకు కూడా పాత్ర ఉన్నట్టు గా పోలీసులు గుర్తించారు. దీంతో ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. ఇక ఈ సమయంలో పోలీసులతో మాట్లాడిన సత్యేంద్ర సింగ్ షెకావత్ దమ్ముంటే నన్ను పట్టుకోండి నా భార్యను కుటుంబాన్ని వేధించొద్దు అంటూ సవాల్ విసిరాడు. దీంతో అతని కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
కార్ల దొంగ ను పట్టుకున్న పోలీసులు .. పీటీ వారెంట్ పై విచారణ చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులు
ఈ ఏడాది మార్చిలో బెంగళూరులోని అమృతహల్లి పోలీసులు సత్యేంద్ర సింగ్ షెకావత్ ను అరెస్ట్ చేశారు. శుక్రవారంనాడు పీటీ వారెంట్ పై బంజారాహిల్స్ పోలీస్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకొని సత్యేంద్ర సింగ్ షెకావత్ చోరీల పై దర్యాప్తు చేస్తున్నారు. అతను చోరీ చేసిన కార్లను రికవరీ చెయ్యటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.