హిందూయిజం దేశ సంస్కృతికి గుర్తింపు, దేశ చరిత్రను వక్రీకరించారు: వెంకయ్య
హైదరాబాద్: హిందూయిజం దేశ సంస్కృతికి గుర్తింపు అని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం నాడు అన్నారు. నగరంలోని పార్క్ హోటల్లో ది క్రానాలజీ ఆన్షియెంట్ ఇండియా పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఏ జాతి అయినా ముందుకు వెళ్లాలంటే వారసత్వ సంపద ఎంతో అవసరమన్నారు. హిందువులైనా, ముస్లింలైనా అందరూ భారతీయులేనని చెప్పారు. ఓట్ల కోసం దేశ చరిత్రను బేరం చేసే కాలం వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశ చరిత్రను ఉద్దేశపూర్వకంగానే కొందరు వక్రీకరించారని చెప్పారు.
హిందూయిజం అనేది మన దేశ సంస్కృతికి గుర్తింపు అన్నారు. దేశంలో సాంస్కృతిక పునరుజ్జీవం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి అందరూ కృషి చేస్తే దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లవచ్చునని చెప్పారు.
రైతు ఆత్మహత్యలు నివారిస్తాం: ఈటెల
వరంగల్ జిల్లా కేంద్రంలోని హన్మకొండలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దీపం పథకం ప్రారంభించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, ఆరూరి రమేశ్, శంకర్ నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఈటెల మాట్లాడారు. రైతు ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రభుత్వ ఆత్మహత్యల నివారణకు చేస్తున్న కృషిని చూసి విపక్షాల్లో ఆందోళన మొదలైంది. విపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.