‘అయ్యా కేసీఆర్! దండం పెడ్తం’: ఆస్పత్రి బిల్డింగ్పైకి ఎక్కి బెదిరింపులు
హైదరాబాద్: తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ గత రెండ్రోజులు దీక్ష చేస్తున్న హోంగార్డుల ఆందోళన ఉధృతంగా మారింది. సోమవారం రాత్రి ఆమరణ దీక్ష చేస్తున్న హోంగార్డులను.. దీక్ష భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా హోంగార్డులు, పోలీసుల మధ్య కొంత తోపులాట చోటు చేసుకుంది.
కాగా, హోంగార్డులు గాంధీ ఆస్పత్రిలోనూ మంగళవారం తమ ఆందోళనలను కొనసాగించారు. గాంధీ ఆస్ప్రత్రి ఆవరణలో ఆందోళన చేస్తుండగా, కొందరు హోంగార్డులు ఆస్పత్రి భవనంపైకి ఎక్కి తమ సమస్యను పరిష్కరించకుండా దూకేస్తామని బెదరింపులకు గురిచేశారు.
తాము రెండ్రోజులుగా దీక్ష చేస్తున్నట్లు హోంగార్డులు తెలిపారు. సోమవారం రాత్రి పోలీసులు తమ దీక్షను భగ్నం చేసి బలవంతంగా గాంధీ ఆస్పత్రిలో చేర్పించారని అన్నారు. తమ ఉద్యోగ భద్రత కోసమే ఆందోళన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
'అయ్యా కేసీఆర్.. దండం పెడ్తాం. మేం కూడా తెలంగాణ బిడ్డలమే. రెగ్యులరైజ్ చేసి మా కుటుంబాలను ఆదుకోండి. రూ. 30వేల జీతం మాకవడం లేదు.. కానీ, రెగ్యులరైజ్ చేయండి' అని ఓ హోంగార్డు నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
హోంగార్డులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 23నుంచి ఆమరణ దీక్షకు పూనుకున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 43వేల మంది జీవితాలు రోడ్డన పడకుండా ఉండాలంటే తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.
తక్షణమే సానుభూతితో అధికారికంగా రెగ్యూలరైజేషన్ చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ పోరాటం ఆగబోదని స్పష్టం చేశారు. 31జిల్లాల నుంచి అందర్నీ పిలిపించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.