ఆట మొదలైంది : తెలంగాణకు ఒకే రోజు ఇద్దరు అగ్రనేతలు : టార్గెట్ కేసీఆర్-రేవంత్ స్టామినాకు పరీక్ష..!!
తెలంగాణలో రాజకీయంగా అసలైన ఆట మొదవుతోంది. తెలంగాణ వేదికగా అధికార టీఆర్ఎస్ - సీఎం కేసీఆర్ లక్ష్యంగా రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి. దుబ్బాక-గ్రేటర్ ఫలితాలతో తమకు రానున్న ఎన్నికల్లో కష్టపడితే ప్రజలు అండగా నిలుస్తారనే ధీమా కమలనాధులు వ్యక్తం చేస్తున్నారు. అయితే, తరువాత జరిగిన నాగార్జున సాగర్ బై పోల్ తో పాటుగా ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు బండి సంజయ్ పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

ఇద్దరు అగ్ర నేతలు ఒకే రోజున రాక..
ఇక, కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ గా రేవంత్ నియామకం తరువాత జోష్ పెరిగిందనే అంచనాతో ఉంది. దీనికి కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఇదే సమయంలో సెప్టెంబర్ 17 తెలంగాణకు ప్రత్యేకత ఉంది. ఆ రోజు తెలంగాణ విమోచన దినోత్సవం అని బీజేపీ చాలా కాలంగా నినదిస్తోంది. అధికారికంగా విమోచన దినోత్సవం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇక, అదే రోజున తెలంగాణకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఆ రోజున నిర్మల్ లో భారీ బహిరంగ సభకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.

నిర్మల్ అమిత్ షా సభ ఎందుకంటే..
మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేపడుతున్న ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డికి చేరుకోనుంది. నిర్మల్ సభతో పాటు కామారెడ్డి సభకు అమిత్ షా హాజరయ్యేలా పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. నిర్మల్ లోని "ఉరులమర్రి"కి చరిత్రలో స్థానం ఉంది. ఆ నిర్మల్ ప్రాంతంలో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి సుమారు వెయ్యి మందికి పైగా ప్రజలు అమరులైన ప్రదేశం కావటం..అందునా సెప్టెంబర్ 17నే అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఖరారు చేయటంతో ఈ ప్రాంతంలో సభకు బీజేపీ నిర్ణయించింది.

దళిత-గిరిజన సభలో రాహుల్ ..
ఇక, ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం అదే రోజున తెలంగాణకు రావటం దాదాపు ఖాయం గా కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్ అయిన తరువాత దళిత ఆత్మగౌరవ సభ, గిరిజన దండోరా పేరుతో ఇప్పటికే రెండు భారీ బహిరంగ సభలను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్వహించింది. ఇప్పుడు ఈ రెండు కలిపి దళిత, గిరిజన దండోరా పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీపీసీసీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్లో లేదా మహబూబాబాద్లో రాహుల్ సభ ఉంటుందని టీ పీసీసీ వర్గాలు చెప్తున్నాయి.

రెండు పార్టీలకు సవాల్- టార్గెట్ కేసీఆర్
సెప్టెంబర్ 17న సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ వచ్చే డేట్ చివరి నిమిషంలో మార్పులు ఉంటే మినహా... ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు 17వ తేదీనే వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అదే సమయంలో అటు అమిత్ షా ..ఇటు రాహుల్ సైతం తెలంగాణ వేదికగా కేసీఆర్ టార్గెట్ గా రాజకీయ ప్రసంగాలు చేసే అవకాశం కనిపిస్తోంది. హుజూరాబాద్ బై పోల్ ఉండటంతో రెండు పార్టీలకు ఈ సభకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి.

రేవంత్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న టూర్
అయితే, రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత తొలి సారి రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తుండటంతో ఈ సభ రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ తోనూ ముడి పడి ఉంది. కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ గా ఉన్న వర్గాలను తిరిగి దగ్గర చేసుకొనే క్రమంలో వరసగా పార్టీ అధినాయకులతో తెలంగాణలో సభలు ఏర్పాటు చేయటం ద్వారా పార్టీలో జోష్ వస్తుందని రేవంత్ భావిస్తున్నారు. దీంతో..ఇప్పుడు రేవంత్ స్టామినాకు రాహుల్ పర్యటన పరీక్షగా మారుతోంది. ఇక, బీజేపీ నేతలు సైతం అమిత్ షా పర్యటన నిర్మల్ లో తమ బల నిరూపణకు వేదికగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications