పోలీసులు చేసిన ఆ పనికి.. దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్..
మహానగర పోలీసుల ప్రచారమంతా వట్టి ఊదరగొట్టుడే తప్ప.. ఆచరణలో మాత్రం అంతా రివర్స్ అనే విషయం ఒకటి తాజాగా వెలుగుచూసింది.
హైదరాబాద్: ఎక్కువ రోజులు ఊరికి దూరంగా ఉండే కుటుంబాలు తమకు సమాచారం అందించాలని మహానగర పోలీసులు నిత్యం చాటింపు వేస్తూనే ఉంటారు. అలా సమాచారం అందించడం ద్వారా ఇంటి భద్రతను తాము పర్యవేక్షిస్తామనేది వారిచ్చే భరోసా.
అయితే మహానగర పోలీసుల ప్రచారమంతా వట్టి ఊదరగొట్టుడే తప్ప.. ఆచరణలో మాత్రం అంతా రివర్స్ అనే విషయం ఒకటి తాజాగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురంలో నివసిస్తున్న ఓ ఇంటి యజమాని.. 'తాము ఊరికి వెళ్తున్నామని, ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది కాబట్టి.. కాస్త అప్పుడప్పుడు ఇంటి భద్రతను పర్యవేక్షిస్తుండి' అని పోలీసులకు చెప్పాడు.
అంతేకాదు, పోలీసుల మీద ఉన్న విశ్వాసంతో ఇంటితాళం చెవి సైతం వారికే ఇచ్చి వెళ్లాడు. ఇక్కడే అసలు కథ బెడిసికొట్టింది. సదరు కుటుంబం ఊరికి వెళ్లిపోవడమే ఆలస్యం.. పోలీసులంతా ఆ ఇంటిని తమ అడ్డాగా మార్చేసుకున్నారు. మందు.. విందు.. చిందు అన్న రీతిలో ఇంటిని ఓ పబ్ లాగా మార్చి పడేశారు.
యథావిధిగా ఖాకీలంతా ఓ అర్థరాత్రి ఆ ఇంట్లో పార్టీ మూడ్లో ఉండగా.. సదరు ఇంటి యజమాని తలుపు తట్టాడు. అంతే.. పోలీసుల నిర్వాకాన్ని చూసి నోరెళ్లబెట్టడం సదరు యజమాని వంతు అయింది. పోలీసులకు అప్పజెప్పితే.. ఏ టెన్షన్ ఉండదు.. వాళ్లే ఇంటి భద్రతను పర్యవేక్షిస్తుంటారు అనుకున్న ఆ ఇంటి యజమానికి ఇదంతా ఓ షాక్ లా అనిపించింది.
అప్పటికే నిషాలో ఉన్న ఖాకీలు మాత్రం.. లైట్ తీస్కో అంటూ ఉచిత సలహా ఇచ్చి అక్కడినుంచి వెళ్లిపోయారట. ఇదన్నమాట సంగతి. దీన్నిబట్టి పోలీసులను నమ్మాలన్నా.. కాస్త వెనుకా ముందు ఆలోచించాల్సిన పరిస్థితి.