కర్ణాటకపై బాబు-కేసీఆర్-పవన్ల ప్రభావమెంత? తెలుగు ఓటరు బీజేపీని కొట్టింది ఇక్కడే లేదంటే 130 సీట్లు!
హైదరాబాద్/అమరావతి: కర్ణాటకలో బీజేపీపై తెలుగు ఓటర్ల ప్రభావం ఏ మేర పడింది? అధికార పీఠానికి దగ్గరగా వచ్చి ఆగిపోయిన కమలం పార్టీని దెబ్బకొట్టింది తెలుగోడేనా? తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు జేడీఎస్కు ఓటేయాలని ఇచ్చిన పిలుపు పని చేసిందా? అంటే అవుననే అనవచ్చు.
కేసీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలుపు, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం చేస్తున్న హామీలు, భవిష్యత్తులో ఫలాలు అందించే జీఎస్టీ, నోట్ల రద్దు వంటి అంశాలపై ప్రజల ఆగ్రహం.. ఇవన్నీ కలిపి బీజేపీకి నష్టం చేశాయని అంటున్నార. ఆ పార్టీ మేజిక్ ఫిగర్కు కేవలం ఎనిమిది సీట్ల దూరంలో ఆగిపోయింది.
ఆ రెండింటి కంటే బీజేపీ పైనే విశ్వాసం కానీ
బీజేపీకి 104, కాంగ్రెస్కు 78, జేడీఎస్కు 38 సీట్లు వచ్చాయి. ఓ విధంగా కర్ణాటక ప్రజలు కాంగ్రెస్, జేడీఎస్లను దారుణంగా తిరస్కరించారు. అయితే మేజిక్ ఫిగర్ రానందున బీజేపీకి పట్టం కట్టారని చెప్పలేం. కానీ ఆ రెండు పార్టీల కంటే బీజేపీపై విశ్వసం ఉంచారని మాత్రం అర్థమవుతోంది. అయితే, కర్ణాటక ప్రజలు బీజేపీపై ఉంచిన విశ్వాసం కంటే తెలుగు ఓటర్ల ఆగ్రహం ఆ పార్టీపై పడిందని అంటున్నారు.
తెలుగు నేతల పిలుపు
కర్ణాటకలో బీజేపీ పలుచోట్ల చాలా తక్కువ మెజార్టీతో ఓటమి చవి చూసింది. 200 నుంచి వెయ్యి లోపు ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. అక్కడ కనుక కాస్త అటు ఇటు అయితే బీజేపీ సులభంగా మరో ఎనిమిది సీట్లు గెలిచేదని అంటున్నారు. మరోవైపు, కొంతమంది బీజేపీ వైపు మొగ్గు చూపినా చాలామంది కాంగ్రెస్ - జేడీఎస్ల వైపు మొగ్గు చూపారని అంటున్నారు. తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను పరిశీలిస్తే తెలుగు నేతలు ఇచ్చిన పిలుపు కొంత ఫలించిందని చెబుతున్నారు.
బీజేపీని దెబ్బకొట్టిన తెలుగు ఓటరు
కర్ణాటకలోని ఫలితాల సరళిని చూస్తే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న 4 జిల్లాల్లో బీజేపీ 11 శాతం విజయం సాధించింది. కానీ ఇతర చోట్ల మాత్రం విజయం శాతం 57గా ఉంది. మరికొన్ని చోట్ల తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉన్నచోట బీజేపీ గెలిచినవి కూడా ఉన్నాయి. తెలుగు ఓటర్లు మద్దతిచ్చినా... తక్కువ మెజార్టీ ఉన్నచోట్ల కాస్త అటు ఇటు అయినా బీజేపీ సులభంగా మెజార్టీ దక్కేదని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఈ లెక్కలు ఎక్కడైనా, ఏ పార్టీకైనా సహజమే.
ఆ నాలుగు జిల్లాల్లో తెలుగు ఓటర్లు దయతలిస్తే
ఈ విషయం పక్కన పెడితే తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న కొన్నిచోట బీజేపీకి మాత్రం దెబ్బపడినట్లుగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయని అర్థమవుతోంది. కొన్నిచోట్ల మాత్రం బీజేపీని ఆదరించారు. తెలుగు ఓటర్లు ఎక్కువగా ఉండే నాలుగు జిల్లాల్లో మాత్రం బీజేపీకి షాక్ తగిలింది. రాయచూర్, కోలార్, బల్లారీ, చిక్బళ్లాపూర్లలో తెలుగు ఓటర్లు ఎక్కువ. ఈ ప్రాంతాల్లో మొత్తం 46 సీట్లు ఉండగా బీజేపీ గెలిచింది 5 సీట్లు మాత్రమే.
బీజేపీ 130 సీట్ల మార్క్కు చేరేది
కర్ణాటకలో మొత్తం 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న ఈ నాలుగు జిల్లాల్లో 46 స్థానాలకు గాను బీజేపీ అయిదు చోట్ల గెలిచింది. మిగతా కర్ణాటకలో 176 స్థానాలకు గాను 99 స్థానాల్లో గెలిచింది. మిగతా కర్ణాటక పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే ఈ నాలుగు జిల్లాల్లోని నలభై ఆరు స్థానాలకు ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపితే 26 సీట్లు రావాలి. కానీ అయిదు మాత్రమే వచ్చాయి. అంటే తెలుగు ఓటర్ల ఆగ్రహం ఇక్కడ కనిపించిందని అంటున్నారు. వెయ్యిలోపు మెజార్టీతో పాటు తెలుగు ఓటర్ల ప్రభావం బీజేపీకి అనుకులంగా ఉంటే బీజేపీ కచ్చితంగా 130 మార్క్కు చేరువయ్యేదని అంటున్నారు. కానీ ఆ పార్టీని దురదృష్టం వెంటాడిందని చెబుతున్నారు.
మోడీ హవా ఉండటం వల్లే
కర్ణాటకలో ఏ లెక్కన చూసినా మోడీ హవా తగ్గలేదని అర్థమవుతోందని అంటున్నరు. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రచారానికి ముందు బీజేపీకి 70లోపు సీట్లు వస్తాయని సర్వేలు అంచనా వేశాయి. మోడీ ప్రచారం తర్వాతే వందకు పైగా వస్తాయని చెప్పాయి. దీనికి తోడు తెలుగు నేతల పిలుపు, చాలాచోట్ల తక్కువ మెజార్టీతో ఓడిపోవడం, తెలుగు ఓటర్ల 'ప్రత్యేక' ఆగ్రహం కారణంగా మాత్రమే బీజేపీ ఓడిందని, కానీ మోడీ హవా తగ్గలేదని అర్థమవుతోందని, ఆయన హవా వల్లే ఈ మాత్రం గెలిచిందని అంటున్నారు. ఇన్ని ఆగ్రహాల మధ్య బీజేపీని కర్ణాటక ప్రజలు విశ్వసించి అందరికంటే ఎక్కువ సీట్లు ఇవ్వడమే అందుకు నిదర్శనం అంటున్నారు.