ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో కెసిఆర్పై ఫైట్ ఎలా?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, యువనేత, ఓటుకు నోటు కేసులో ఏ1 నిందితుడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన దూకుడు ఏమాత్రం తగ్గించడం లేదు. తనను కుట్రపూరితంగా ఇరికించారని అందరూ భావిస్తున్నారని ఆయన చెబుతున్నారు.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కోకముందు, ఆ తర్వాత కూడా ఆయన కెసిఆర్ పైన తన దూకుడును తగ్గించుకోలేదు. కెసిఆర్ను అసెంబ్లీలో నిలదీస్తానని శుక్రవారం స్పష్టం చేశారు.
ఓటుకు నోటు కేసుకు ముందు రేవంత్.. ప్రెస్ మీట్లు పెట్టి కెసిఆర్ పైన దుమ్మెత్తి పోసేవారు. కెసిఆర్ పైన ఎన్నో ఆరోపణలు చేశారు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో అరెస్టై జైలుకు వెళ్లారు. ఓటుకు నోటు కేసు అనంతరం టిఆర్ఎస్ ఆయన నియోజకవర్గమైన కొండగల్ పైన ప్రత్యేక దృష్టి సారించినట్లుగా వార్తలొచ్చాయి.
రేవంత్కు కొడంగల్ నియోజకవర్గంలో తిరుగులేదు. అలాంటి కొడంగల్ నియోజకవర్గంలో పలువురు టిడిపి నేతలను తమ వైపుకు రప్పించుకోవాలని టిఆర్ఎస్ ప్రయత్నాలు చేశారని అంటుంటారు. అయితే, అది ఏ మేరకు సాధ్యమైందనేది తెలియాల్సి ఉంది.
ఓటుకు నోటు కేసు నేపథ్యంలో రేవంత్ రెడ్డి పైన వేటును టిఆర్ఎస్ ప్రభుత్వం పరిశీలించినట్లుగా వార్తలొచ్చాయి. అదే సమయంలో రేవంతే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారనే చర్చ కూడా సాగింది. అయితే, వీటన్నింటిని రేవంత్ ఇటీవల కొట్టి పారేశారు.
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి మరోసారి వేగం పెంచింది. టిడిపి యువనేత నారా లోకేష్ డ్రైవర్కు నోటీసులు ఇచ్చింది. ఆయన ఎసిబి ఎదుట హాజరు కాలేదు. త్వరలో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశముంది.
ఎసిబి తొలి ఛార్జీషీట్ దాఖలు చేసింది. తొలి ఛార్జీషీట్లో రేవంత్, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్ల పేర్లను ప్రస్తావించింది. సప్లిమెంటరీ ఛార్జీషీట్ దాఖలు చేసే వరకు రేవంత్ రెడ్డికి ఊరటనే అని చెప్పవచ్చు. సప్లిమెంటరీ ఛార్జీషీట్ దాఖలు చేశాక.. రేవంత్కు మరోసారి సమన్లు జారీ చేయడం, ఆయన ఎసిబి ఎదుట హాజరయ్యే అవకాశాలున్నాయి.
అయితే, త్వరలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో తాను కెసిఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. దీంతో ఆయన విషయం మరోసారి చర్చనీయాంశమైంది. గతంలో వలె రేవంత్కు ప్రభుత్వ మాట్లాడటాన్ని అడ్డుకుంటుందా? లేక అవకాశమిస్తుందా అనేది ఇప్పుడే తేలే అంశం కాదు.
ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న రేవంత్ రెడ్డి... కెసిఆర్ను అసెంబ్లీలో ఎలా నిలదీస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కెసిఆర్ను గద్దె దించే వరకు తాను పోరాడుతానని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.