ఊహించని హామీ, 2019లో కేసీఆర్ ఓట్లుగా మలుచుకోగలరా?
హైదరాబాద్: ఇంటింటికి సురక్షిత మంచినీరు అందిస్తానని, తన ఈ హామీని నిలబెట్టుకోకుంటే వచ్చే ఎన్నికల్లో తనకు ఓట్లు వేయవద్దని ధైర్యంగా చెప్పే రాజకీయ నాయకుడు చాలా అరుదు అని చెప్పవచ్చు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ సవాల్ చేశారు.
మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథను ప్రారంభించింది. ఎన్నికల నాటికి ఇంటింటికి నల్లా నీరు అందించకుంటే ఓటు వేయవద్దని చెప్పారు.
98 శాతం ఇళ్లకు నీరు
మిషన్ భగీరథ కోసం పైప్ లైన్ వేయడం వేగవంతంగా సాగుతోంది. రిపబ్లిక్ డే నాటికి చాలా వరకు పూర్తి కానుంది. రాష్ట్రంలో ఇంటింటికి నల్లా, నీరు ఇచ్చేందుకు మరో ఏడాది తీసుకోనుంది. ఇటీవల కేసీఆర్ జిల్లాల్లో పర్యటించారు. ఈ పర్యటన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. 98 శాతం ఇళ్లకు మరో 45 రోజుల్లో మిషన్ భగీరథ కింద నీటిని ఇస్తామని చెప్పారు.
2016లో శంకుస్థాపన
కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. ఆ తర్వాత ఆయన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆ సమయంలో పై ప్రకటన చేశారు. మేడిగడ్డ వద్ద ఈ ప్రాజెక్టుకు మే 2, 2016లో కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాడు కాళేశ్వరం ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఈ శంకుస్థాపన చేశారు.
365 రోజులు నీరు అందుబాటులో
మేడిగడ్డ వద్ద గోదావరిలో 365 రోజులు నీరు అందుబాటులో ఉంటుందని నాడు కేసీఆర్ చెప్పారు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలలో 28 టీఎంసీలకు పైగా నీటిని నిలువ చేయవచ్చు. వివిధ పంపు హౌస్ల ద్వారా 4,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు.
హరీష్ రావుకు ఆదేశాలు
కాళేశ్వరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు ప్రతి పది రోజులకు ఓసారి పర్యవేక్షించాలని మంత్రి హరీష్ రావుకు కేసీఆర్ సూచించారు. అలాగే తాను నెల రోజులకు ఓసారి రివ్యూ చేస్తానని చెప్పారు. ఈ ప్రాజెక్టు పనుల నిమిత్తం ఇంజినీర్లకు 200 రోజుల డెడ్ లైన్ విధించారు.
కేసీఆర్ హామీ
తాను ఇంటింటికి నీటిని ఇస్తానని కేసీఆర్ 2014 ఎన్నికల సమయంలో చెప్పారు. ఈ హామీని నెరవేర్చేందుకు కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు అన్ని రకాల అనుమతులు వచ్చాయి. అయితే భూసేకరణ మాత్రం ఇబ్బందికరంగా మారింది. భూసేకరణకు ఇబ్బంది లేకుండా, అందరినీ ఒప్పించేలా ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి వచ్చే తెలంగాణ ఆవిర్భావోత్సవం నాటికి దానిని ప్రజలకు అంకితం చేయాలని చూస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.25వేల కోట్లను ప్రభుత్వం ఇచ్చింది. బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా రూ.20వేల కోట్లను సమీకరించింది. ప్రాజెక్టును పూర్తి చేయడం, ఇంటింటికి నీరు ఇవ్వడం ద్వారా 2019లో తిరిగి ప్రజల మన్నన పొందాలని తెరాస భావిస్తోంది.