పదండి ఓటేద్దాం! ఆన్లైన్లో ఓటర్ స్లిప్పులు, పోలింగ్ బూత్ వివరాలు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం తెలంగాణలో 17, ఏపీలో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గల్లో పోలింగ్ జరగనుంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా, స్లిప్పుల పంపిణీ, పోలింగ్ కేంద్రాల ఆచూకీ కనుక్కోవడం సులభమే అయినా పట్టణాలు, నగరాల్లో మాత్రం ఇది పెద్ద ప్రహసనమే. ఈ నేపథ్యంలో ఓటర్ స్లిప్పులు ఎలా పొందాలి? పోలింగ్ స్టేషన్ వివరాలు ఎలా తెలుసుకోవాలి? గుర్తింపు కార్డులుగా వేటిని పరిగణిస్తారన్న విషయాలను తెలుసుకుందాం.
మరోసారి నగరం ఖాళీ..! ఓటు బాట పట్టిన జనం.. !!
ఆన్లైన్లో ఓటర్ స్లిప్పులు
గురువారం పోలింగ్ నేపథ్యంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తైంది. ఆ స్లిప్పులపై ఓటరు వివరాలతో పాటు నియోజకవర్గం పేరు, పోలింగ్ కేంద్రం వివరాలు ఉంటాయి. ఒకవేళ ఈ స్లిప్పులు అందకపోతే ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్లి సెర్చ్ యువర్ నేమ్ ఆప్షన్ పై క్లిక్ చేసి నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. అప్పుడు నేషనల్ ఓటర్స్ సర్వీసెల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో పేరు, తండ్రి పేరు, వయసు, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వివరాలు నమోదు చేస్తే ఓటర్ వివరాలు ప్రత్యక్షమవుతాయి. వ్యూ డిటైల్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే పూర్తి వివరాలు కనిపిస్తాయి. వాటిని ప్రింట్ తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
పోలింగ్ కేంద్రం వివరాలు
ఓటర్ స్లిప్పుల్లో పోలింగ్ కేంద్రానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. కమిషన్ వెబ్సైట్లోనూ ఆ వివరాలు పొందుపరిచారు. ఓటరు కార్డుపై ఉండే ఎపిక్ నంబర్ను 9223166166 నెంబర్కు మెసేజ్ చేయడం ద్వారా పోలింగ్ స్టేషన్ వివరాలు పొందవచ్చు. 1950 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయడం ద్వారా కూడా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉన్న నా ఓట్ యాప్ ద్వారా ఎపిక్ నెంబర్ ఎంటర్ చేసి ఓటర్ వివరాలు తెలుసుకోవచ్చు.
పోలింగ్ ప్రక్రియ ఇలా
ఓటరు పోలింగ్ కేంద్రంలో అడుగుపెట్టిన వెంటనే అక్కడి పోలింగ్ అధికారికి గుర్తింపు కార్డు చూపాలి. ఆ అధికారి ఓటరు సీరియల్ నెంబర్, పేరు చదువుతారు. పోలింగ్ ఏజెంట్లు వారి వద్ద ఉన్న లిస్టులో వివరాలు సరిచూసుకుంటారు. ఆతర్వాత మరో అధికారి ఓటరు చూపుడు వేలిపై ఇంకుతో గుర్తు పెడతారు. రిజిస్టర్లో సంతకం చేసిన అనంతరం ఓటర్ స్లిప్పు ఇస్తారు. ఆ స్లిప్పు తీసుకుని మరో అధికారి ఈవీఎం కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ బటన్ నొక్కుతారు. దీంతో ఓటింగ్ కంపార్ట్మెంట్లోని బ్యాలెట్ యూనిట్ రెడీ అవుతుంది. ఈవీఎంలో ఓటు వేయాలనుకునే అభ్యర్థి పేరు ఎదురుగా ఉన్న బ్లూ కలర్ బటన్ నొక్కితే చిన్న బల్బు వెలిగి బీప్మని శబ్దం వస్తుంది. దీంతో ఓటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.
గుర్తింపు కార్డు తప్పనిసరి
ఓటర్లు ఓటు వేసేందుకు తప్పనిసరిగా గుర్తింపు కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓటర్ ఐడీ, రేషన్ కార్డ్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, పెన్షన్ డాక్యుమెంట్, జాబ్ కార్డ్లలో దేన్నైనా గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు. పోలింగ్ కేంద్రాలలోకి సెల్ఫోన్లు, కెమరాలు, ల్యాప్టాప్లను అనుమతించరు. దివ్యాంగుల కోసం పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా ర్యాంపులు, క్యూలు, వీల్ చైయిర్స్తో పాటు బ్రెయిలీ లిపితో కూడిన ఈవీఎలు, బ్యాలెట్ పేపర్లను సిద్ధం చేశారు.