సహకార ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే హవా: మద్దతుదారుల గెలుపు
హైదరాబాద్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. అత్యధిక సహకార సంఘాలను తమ ఖాతాలో చేర్చుకునే దిశగా గులాబీ పార్టీ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా, సొసైటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతుదారులు 11వేల డైరెక్టర్ పోస్టులను కైవసం చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ ఖాతాలో 900 సహకార సంఘాలు చేరనున్నాయి.
సహకార సంఘాల ఎన్నికలకు శనివారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరిగింది. రాష్ట్రంలో మొత్తం 906 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్) ఉండగా, 904 సొసైటీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 157 సింగిల్ విండోల్లోని 2017 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

మిగిలిన 747 పీఏసీఎస్ ల్లోని 3388 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 6248 వార్డుల డైరెక్టర్ పదవుల కోసం ఎన్నికలు జరిగాయి. ఈ స్థానాల్లో 14,530 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్లో మొత్తం 9,11,599 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అన్ని చోట్లా ఓట్ల లెక్కింపుతోపాటు ఫలితాల ప్రకటన కూడా పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు సహకార శాఖ ప్రకటించింది. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులకు విజయాన్ని కట్టబెట్టిన రైతులకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 90శాతానికి పైగా సొసైటీలను టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారని, డీసీసీబీ, డీసీఎంఎస్లు పూర్తిగా టీఆర్ఎస్ మద్దతుదారులు గెలుచుకున్నారని తెలిపారు.












Click it and Unblock the Notifications